భద్రాచలం, మార్చి 23 : హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ఆలయంలో ఆదివారం అంకురారోపణం చేయనున్నారు.
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి, 18న రామయ్యకు పట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీరామ నవమి ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమానికి ఆలయ ఈవో, అర్చకులు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో సీఎస్ శాంతికుమారి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి ఆలయ ఈవో ఎల్.రమాదేవి అర్చకులతో కలిసి పత్రికలు అందజేశారు.
హోలీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సోమవారం సహస్రధారలతో కనుల పండువగా అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత స్వామివారిని వెండి ఊయలలో వేంచేపు చేసి డోలోత్సవం చేపడతారు. ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నరసింహాదాసు కీర్తనలు ఆలపిస్తుండగా.. నక్షత్ర, కుంభ తదితర హారతులను స్వామివారికి సమర్పిస్తారు.
హోలీ పండుగను పురస్కరించుకొని స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు స్వామివారి తిరువీధి సేవ నిర్వహిస్తారు. అలాగే హోలీ పండుగ రోజు రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వార దర్శనం వద్ద పసుపు కొమ్ములు దంచుట, తలంబ్రాలు కలుపుట తదితర పనులు చేపడతారు. దీంతో స్వామివారిని పెండ్లి కుమారునిగా చేసినట్లు భక్తులు భావిస్తారు.