ఖమ్మం: క్రీడలు మానసిక ఉల్లాసాన్నిపెంపొందిస్తాయని ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి అన్నారు. డిసెంబర్ 6న హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకొని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జిల్లా హోంగార్డ్ ఆఫీసర్స్కు వివిధ క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించిన అడిషనల్ డీసీపీ క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో హోంగార్డులకు ప్రత్యేక స్థానం ఉందని ఇదే స్పూర్తితో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
క్రీడల పట్ల మక్కువ పెంచుకుని తమ పిల్లలను సైతం క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని చెప్పారు. గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 6వతేదీన పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి విజయబాబు, హోంగార్డ్ ఆర్ఐ శ్రీశైలం, ఆర్ఐలు శ్రీనివాస్, రవి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.