ఇల్లెందు, డిసెంబర్ 2: ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి వైపే నిలిచారని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలకు పాల్పడ్డా ఇల్లెందు గడ్డపై గులాబీజెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లెందు పాత బస్టాండ్ వద్ద నున్న పార్టీ ఎన్నికల కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించానని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.18 వేల కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని వివరించారు. ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డానని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు తోడునీడగా నిలిచానని అన్నారు. మూడు రోజల క్రితం జరిగిన ఎన్నికల్లో అనేకమంది ప్రజలు పార్టీలకు అతీతంగా, ప్రలోభాలకు గురికాకుండా ముందుకు వచ్చి బీఆర్ఎస్లో చేరారని, తనను గెలిపించుకోవాలనే తపనతో పనిచేశారని వివరించారు.
పార్టీపై నమ్మకంతో నియోజకవర్గ వ్యాప్తంలో కాంగ్రెస్, ఎన్డీ సహా ఇతర పార్టీల నుంచి వందలాది మంది ప్రజలు వచ్చి బీఆర్ఎస్లో చేరారని అన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎన్నికల సమయంలో అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యకు అమ్ముడు పోయి ఆయనకు దగ్గరకు చేరారని విమర్శించారు. అయినా, పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. చివరి నిమిషం వరకూ పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేసిన శ్రేణులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా బాధ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఇల్లెందులో ముమ్మాటికీ బీఆర్ఎస్సే గెలవబోతున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, జేకే శ్రీను, బబ్లూ, శీలం రమేశ్, జానీపాషా, ప్రమోద్, ఖమ్మంపాటి రేణుక, ఘాజీ, రమేశ్, మురళి, కృష్ణారావు, రవితేజ, గుండా శ్రీకాంత్, సన రాజేశ్, హరికృష్ణ, గిన్నారపు రాజేశ్ పాల్గొన్నారు.