ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 14: మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో రూ.25 కోట్లతో ఏర్పాటు చేయబోయే నూతన నర్సింగ్ కళాశాలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వరెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులతో మంత్రి హరీశ్రావు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కందాళ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మట్లాడారు. కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారని గుర్తుచేశారు. పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం గత నెలలోనే రూ.115 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని అన్నారు. వీటితోపాటు జేఎన్టీయూహెచ్, నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని బాలింతల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కిట్ల రూపంలో అందిస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం తిట్ల రూపంలో అక్కసును వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. మరో ఆరు నెలల్లో సీతారామ నీళ్లు పాలేరుకు వస్తాయని అన్నారు.
రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్, నర్సింగ్ కళాశాలలు ప్రారంభించుకోవడం గొప్ప విషయమని మంత్రి అజయ్ పేర్కొన్నారు. పాలేరులో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. అయితే పారామెడికల్ కళాశాలను కూడా ఏర్పా టు చేస్తే మరింత బాగుంటుందని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, మంత్రి హరీశ్ స్పందిస్తూ.. పారామెడికల్ కళాశాలతోపాటు ఖమ్మం వైద్యశాలకు ఎంఆర్ఐ స్కానింగ్ను మంజూరు చేస్తామన్నారు.
పాలేరు నియోజకవర్గానికి ఏకకాలంలోనే ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గాన్ని విద్యావనరుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి అభివృద్ధి, సంక్షేమానికి కారణమైన సీఎం కేసీఆర్ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, వీపీ గౌతమ్, సీపీ విష్ణు, బెల్లం ఉమ, ఇంటూరి శేఖర్, గూడ సంజీవరెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, డాక్టర్ విద్యాలత, డాక్టర్ మాలతి, గణేశ్, పీవీ రామకృష్ణ, రవీందర్రెడ్డి, బెల్లం వేణు పాల్గొన్నారు.