ఖమ్మం అర్బన్, జనవరి 31: పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.
వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నాపత్రాన్ని అందజేయగా.. 20 మార్కులను పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసి కేటాయిస్తారు. ఆ మార్కులు, సమాధాన పత్రాలను పరిశీలించి.. ఆయా పాఠశాలలు సక్రమంగా మార్కులు నమోదు చేశారా? లేదా? అనే కోణంలో భాగంగా బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలను బృందాలు తనిఖీ చేయనున్నాయి.
తనిఖీలకు వెళ్లిన అధికారుల బృందంలో ముగ్గురు సబ్జెక్టు నిపుణులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్టుల ఆధారంగా ప్రతీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను పరిశీలిస్తారు. మార్కుల ప్రొఫార్మాను పోల్చుతూ విద్యార్థి రాసిన సమాధాన పత్రాలు సరిగ్గా ఉన్నాయో.. లేవో.. సరిచూస్తారు. దీంతోపాటు విద్యార్థి రాసిన సమాధానాలకు ఉపాధ్యాయులు సరిగ్గా మార్కులు వేశారా? తప్పులు ఏమైనా దొర్లాయా? ఇతరత్రా ప్రభావితం జరిగిందా? అనే కోణంలోనూ పరిశీలిస్తారు.
విద్యార్థుల హాజరు పట్టిక, ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలిస్తారు. సబ్జెక్టు నిపుణులు పరిశీలించిన వాటిలో హెచ్చుతగ్గులు ఉంటే సంబంధిత బృంద నాయకుడికి వివరిస్తారు. యాజమాన్యాల వారీగా ఎయిడెడ్, బీసీ వెల్ఫేర్, ప్రభుత్వ, ఐటీడీఏ, కేజీబీవీలు, టీఎస్ఎంఎస్, ప్రైవేట్, టీఎస్ఆర్ఎస్, టీ ఎస్డబ్ల్యూఆర్ఈఎస్, జడ్పీలో కలిపి మొత్తం 16,416 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు రోజుకు రెండు లేదా మూడు స్కూళ్ల చొప్పున తనిఖీలు చేపట్టనున్నారు.
ఇంటర్నల్ మార్కుల ప్రక్రియలో పాల్గొనేందుకు జిల్లాలో 57 బృందాలను నియమించారు. ప్రతీ బృందానికి ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుడు నాయకత్వం వహిస్తారు. వారి ఆధ్వర్యంలో ప్రతీ బృందానికి ముగ్గురు సబ్జెక్టు ఎక్స్ఫర్ట్లను నియమించారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు ఒకరు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు ఒకరు, సోషల్, సైన్స్ సబ్జెక్ట్లకు ఒకరు చొప్పున నియమించారు. తనిఖీలు ఎలా చేయాలి? ఏయే అంశాలను పరిశీలించాలి? అనే విషయాలపై ఒకటి రెండు రోజుల్లో డీసీఈబీ సెక్రటరీ నారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సూచనలు చేయనున్నారు.