భద్రాచలం, డిసెంబర్ 29: తమ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీలు, కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ఆమెను బొల్లారంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తమ ఐటీడీఏ పరిధిలో మారుమూల ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న కొండరెడ్లు, చెంచులు, కొలం ఆదివాసీ తెగ గిరిజన కుటుంబాల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రత్యేక నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు.
బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన కుటుంబాల జీవనోపాధి కోసం గ్రామాల్లో జీసీసీ ద్వారా డీఆర్ డిపోలు, అంగన్వాడీ సెంటర్లు, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వారి ఆర్థికాభివృద్ధి కోసం ట్రైకార్ రుణాలు మంజూరు చేస్తున్నామని, గ్రామాలకు రోడ్లు, మంజూరు చేస్తున్నామని, గిరి పోషణ గర్భిణులకు, చిన్నారులకు ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. నిరుద్యోగ యువతకు హ్యాండ్క్రాఫ్ట్ రుణాలు సహా ఇంకా అనేక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. కాగా, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం గిరిజన సంక్షేమ శాఖ తీసుకుంటున్న చర్యలు, ఐటీడీఏల పీవోలు చేస్తున్న కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ సౌందరరాజన్ అభినందించారు. గిరిజనుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. తమను కలవడానికి వచ్చిన గిరిజనులతో మాట్లాడి వారిని అభినందించారు.