భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు కోసం ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ నుంచి సీఎస్ డాక్టర్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో ఆమె వీసీలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ బాగుందని అధికారులను అభినందించారు. క్యాంపుల వద్ద ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యాంపుల నిర్వహణపై ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటివరకు శిబిరాల్లో మొత్తం 12,235 మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.
రీడింగ్ సమస్య ఉన్న 4,522 మందికి అద్దాలు ఇవ్వడం ఇచ్చామని, 1,879 మందికి కళ్ల అద్దాలు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ చాలా బాగుందని అభినందించారు. డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, డీపీవో రమాకాంత్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, జనవరి 21: ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 55 బృందాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. శుక్రవారం నాటికి 13,673 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 4,270 మందికి రీడింగ్ కళ్ల అద్దాలు అందించినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఎంహెచ్వో మాలతి, జడ్పీ సీఈవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.