కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 15: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్పీ రోహిత్రాజు పేర్కొన్నారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించేందుకే ఆటలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. టీఎన్జీవోస్, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో భద్రాద్రి జిల్లా స్థాయి క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవానికి ఎస్పీ రోహిత్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ఆరోగ్యానికేగాక మానసిక ఉల్లాసానికీ ఎంతగానో తోడ్పడుతాయని వివరించారు. ఈ ఆటల ద్వారా స్నేహభావం కూడా పెంపొందుతుందని అన్నారు. అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అమరనేని రామారావు మాట్లాడుతూ..
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్తంగా ‘ఖేలో భద్రాద్రి’ పేరిట క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. మూడు రోజులపాటు ఈ క్రీడలు కొనసాగుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, నాలుగో తరగతి సిబ్బందికి ఈ నెల 17 వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ పోటీల్లో 295 టీములుగా ఉద్యోగులు పాల్గొంటున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం, టీఎన్జీవోస్ బాధ్యులు కే.సాయిభార్గవ చైతన్య, రామనర్సయ్య, వీరబాబు, సోమయ్య, ప్రకాశ్, జానిమియా, రమేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.