భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలు వర్తింపజేయాలని భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ, పెనగడప గ్రామాల్లో ఆయన ప్రజా పాలన గ్రామసభలను సందర్శించారు. దరఖాస్తుదారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు ఎవరైనా దరఖాస్తులు పూర్తి చేయడం మరిచిపోయినా వారికి చెప్పి మరీ పూర్తి చేయించాలన్నారు.
శనివారంతో ముగియనున్న గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ అధికారులు ఆన్లైన్ చేస్తారన్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట మండల కేంద్రాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామసభలను సందర్శించారు. కలెక్టర్ ప్రియాంక ఆల గ్రామసభలను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ రాంబాబు గ్రామసభల తీరును పరిశీలించారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తుల స్వీకరణలో లోటుపాట్లను గమనించి ఆన్లైన్ విధానంపై వివరించారు. మున్సిపాల్టీల్లో చైర్మన్లు, ప్రత్యేకాధికారులు గ్రామసభలను పగడ్బందీగా నిర్వహించారు.