సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను కేంద్రానికి అమ్మింది. ఇగ కార్మికుల భద్రతను పట్టించుకోకుండా చోద్యం చూసింది. నాటి పాలకుల తీరుతో సంస్థ నష్టాల్లోకి వెళ్లగా, స్వరాష్ట్రంలో పునర్వైభవం దిశగా సాగింది. కార్మికుల ఒక్కో హక్కును సాధిస్తూనే, సంస్థ గణనీయ లాభాల వైపు అడుగులు వేసింది. కారుణ్య నియామకాల పునరుద్ధరణ, ఇతర డిమాండ్లు నెరవేరడం కార్మికలోకంలో సంతోషం నింపింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో గత తొమ్మిదేళ్లలో సాధించిన హక్కులను గుర్తు చేసుకుంటున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీబీజీకేఎస్ యూనియన్ తమను, సంస్థను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నరని స్పష్టం చేస్తున్నది.
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 12 : బొగ్గుబాయి పని అంటేనే గజ్జున వణకాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. భూగర్భ గనుల్లో లోసీమ్లో డ్యూటీ చేసేందుకు పోతే తిరిగి రావాలని దేవుడిని మొక్కుకొని పోయేటోళ్లు. దినదిన గండంగా భయపడుతూ భిక్కుభిక్కుమంటూ పని చేసేటోళ్లు. భూ గర్భగనుల్లో చిన్నగా ఉన్న రంధ్రాల్లోకి వంగిపోయి బొగ్గును తవ్వుకొని తట్టలతో నెత్తిమీద పెట్టుకొని బయటికి తెచ్చి పోయాలంటే దుఃఖం వచ్చేది. ప్రకృత్రికి విరుద్ధంగా భూగర్భంలో రెండున్నర కిలోమీటర్లు లోపలికి నడిచిపోయి, రెండున్నర కిలోమీటర్లు తిరిగి రావడానికే సగం శక్తి వృథా అయ్యేది. కార్మికుల భద్రత అందని ద్రాక్షగా ఉండేది.
తెలంగాణ వచ్చాక గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వ ప్రోత్సాహంతో సింగరేణి సంస్థ ఎన్నో విజయాలు సాధించింది. ఉమ్మడి పాలనలో నష్టాల్లో ఉన్న సంస్థ ఇప్పుడు లాభాలు చూస్తున్నది. బొగ్గు ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమంలోనూ దూసుకుపోతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు సింగరేణి కార్మికుల దశ, దిశను మార్చాయి. కార్మికులకు సంస్థ లాభాల్లో అత్యధిక లాభాలు వచ్చాయి. పని విధానం మెరుగుపడింది. భూగర్భ గనుల్లో ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకప్పుడు మనిషి చేసే పని ఇప్పుడు మిషనరీ చేస్తున్నది. గనుల్లోకి నడిచివెళ్లే అక్కర లేకుండా మ్యాన్రైడింగ్ వచ్చింది. కార్మికులకు భద్రత పెరిగింది. బ్లాస్టింగ్ పద్ధతులు మారాయి. సులభతరమైన పని విధానాలు వచ్చాయని కార్మికులు చెబుతున్నారు. గడిచిన పదేండ్లలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలతో సంస్థకు నష్టాలు తప్పినయ్. కష్టాలు తప్పినయ్ అంటూ కార్మికుల కడుపులోని ‘అసలు ముచ్చట’ చెప్తున్నరు. ఎస్సార్పీ-3 మైన్పై కార్మికుల ముచ్చట వారి మాటల్లోనే..
అవ్ నర్సింగ్ కాక.. లాభాల్లా వాటా ఇచ్చుడు ఒక్కటేనానే.. కారుణ్య నియామకం ఇచ్చి నా బతుకును నిలబెట్టిండ్రు.. మా నాయన రిటైర్మెంట్ అయినంక ఆ నౌకరి నాకు రాదని బాధపడిన. గప్పటికే కాంగ్రెసోళ్లు కారుణ్య నియామకాలను తీసేసి 24 ఏండ్లు అయితుండే. నాకు రావాల్సిన నాన్న ఉద్యోగం ఆగిపోయి ఆఖరికి నేను డ్రైవర్ పనిలో చేరిన. తెలంగాణ వచ్చినంక 2016లో దరఖాస్తులు పెట్టుకొమ్మన్నరు. గప్పుడు అప్లయ్ చేస్తే 2020లో నాన్న వారసత్వ ఉద్యోగం నాకు వచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం రావాల్సిన నౌకరి నాకు 30 ఏండ్ల వయసు వచ్చినంక వచ్చే. కేసీఆర్ చలువతోనే నేను మా కుటుంబం సంతోషంగా బతుకుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక గీ నిర్ణయం తీసుకోకుంటే నాకు సింగరేణి నౌకరి వచ్చేది కాదు. సింగరేణిలో 12,500 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చి, 2015 వరకు పెండింగ్లో ఉన్న 3,500 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత తెలంగాణ సర్కార్కే దక్కుతది.
అబ్బా ఏం చెప్పినవ్ కుమారు.. ఎన్ని జేసిండ్రు మన కోసం. గీ ప్రభుత్వంలో ఎవ్వలు ఊహించనివి కూడా చేసి చూపిచ్చిండ్రు. అంబేద్కర్ జయంతి, క్రిస్మస్, రంజాన్, సంకాంత్రికి పీహెచ్డీ(పెయిడ్ హాలీ డే) ఇస్తున్నరు. తెలంగాణ వచ్చినంక 2014 వరకు కంపెనీ రోల్స్లో ఉన్న ప్రతి కార్మికుడికి తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు.. తెలంగాణ కంటే ముందే ప్రత్యేక రాష్ర్టాలు ఎన్నో ఏర్పడినయ్. కానీ.. అక్కడున్న బొగ్గు గనుల్లో వాళ్లు ఏం చేయలే.. మనకైతే ఇంక్రిమెంట్ వేసిండ్రు. 2011లో సకల జనుల సమ్మె చేసినం… 45 రోజులు పలుగు, పార పక్కన పెట్టి కొట్లాడినం… గా సమ్మె పీరియడ్కు కూడా జీతం ఇచ్చుడు ఒక మిరాకిల్ తెలుసా.. ఒకప్పుడు కార్మికులకు, వాళ్ల పిల్లలకు మాత్రమే కార్పొరేట్ వైద్య సదుపాయం ఉండే. ఇప్పుడు తల్లిదండ్రులను కూడా చేర్చిండ్రు. కరెంట్ బిల్లులు మాఫీ చేసి.. సంస్థ అధికారులతో సమానంగా మనకు ఏసీ బిల్ కూడా ఇస్తున్నరు. కార్మికులు సచ్చిపోతే రూ.25 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నరు. కోలిండియాలోనే ఎక్కడా లేని సంక్షేమం సింగరేణి కార్మికులకు అందిస్తున్న గొప్ప రాష్ట్రం ఒక్క తెలంగాణనే.. గివన్నీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండబట్టిగనే అయినయ్. నేనైతే బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కే ఓటు గుద్దుతా.. కుల్లంకుల్లా చెపుతున్న. షిప్ట్ టైం అయితాంది. ఇగ బాయిలకు పోదమ్ పాండ్రి.. అవునవును.. కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఉద్యమంలో కార్మికుల పోరాటాన్ని, తెగింపు చూసిన కేసీఆర్ సీఎం అయ్యాకే సింగరేణి బతుకు మారింది. ప్రతి ఏడాది కార్మికులకు లాభాల వాటా పెంచి ఇస్తున్నరు. ఈ ఏడాది 32 శాతం ఇచ్చిండు. 2000 సంవత్సరం నుంచి లాభాల వాటా 10శాతంతో ఇవ్వడంతోని మొదలుపెట్టిండ్రు. గప్పుడున్న ప్రభుత్వాలు పెద్దగ పెంచలే. 2014 వచ్చినంక ఇచ్చింది 16శాతమే. కానీ తెలంగాణ వచ్చినంక 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్లలో 32 శాతానికి లాభాల వాటా తీసుకుపోయిండ్రు. సంస్థ కష్టాల్లో ఉన్నా, లాభాలు తగ్గినా, పెరిగినా లాభాల వాటా ప్రతి ఏటా పెంచి ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. దసరా, దీపావళికి ముందే లాభాల వాటా బ్యాంకుల వడుతున్నయ్. తక్కువల తక్కువ ఒకొక్కలికి రూ.వేల నుంచి రూ.మూడు లక్షల దాకా లాభాల వాట వచ్చింది. 2014కు ముందు రూ.20వేలు, రూ.30వేలు కూడా రాకపోయేది. ఒక్కొక్కసారి రూ.10 వేలు కూడా వచ్చిన సందర్భాలున్నయ్. తెలంగాణ రాకుంటే గింతగనం వచ్చేటియి కాదు.
నేను ఉపాయం చేస్తున్న అన్న.. మొన్నీ మధ్య చుట్టపోళ్లు ఇండ్లళ్లకు వచ్చినప్పుడు ఆడ కూడా ఇదే ముచ్చట వచ్చింది. కారుణ్య నియామకం కింద నాకు నౌకరి వచ్చింది. దిగుపోయే లోపు సొంతిల్లు కట్టుకుంటా.. నా అసోంటోళ్లు ఎంతో మంది కారుణ్య నియామకం కింద వచ్చినోళ్లు.. ఇప్పుడు మంచిగ బతుకుతుర్రు.. బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు సదివి సాఫ్ట్వేర్ చేసినోళ్లు, మల్టీ నేషనల్ కంపెనీల్లో చేసినోళ్లు కూడా గిప్పుడు వచ్చి కారుణ్య నియామకం చేరుతున్నరు. ఒకప్పుడు బాయిపని గింత ఈజీగా ఏడుండే.. మా నాన్న నేను చేరుతా అన్నప్పుడు వొద్దు అన్నడు. గా పని నువ్వేడ జేస్తవ్ బిడ్డా.. తట్ట మోసుడు నీతోని కాదన్నడు. కానీ.. ఇప్పుడు తట్ట మోసుడు లేకపాయే.. మిషన్ ఎత్తిపోస్తున్నది గదా.. మిగిలిన పనులు పెద్ద రిస్క్ లేనివి అయ్యేసరికి అందరూ సింగరేణిలో పని ఎక్కాలనుకుంటున్నరు. తెలంగాణ వచ్చినంక బొగ్గుబాయి పని సులువైంది. కారుణ్య ఉద్యోగాలే గాకుండా.. సింగరేణి నౌకర్లలో గూడా 80 శాతం సింగరేణి ప్రాంతంలో ఉన్న యువతకే ఉద్యోగాలు కల్పించిండ్రు.