కొత్తగూడెం సింగరేణి, మార్చి 17: సింగరేణి సంస్థ తాను వినియోగించే విద్యుత్కు సమానంగా 2024వ సంవత్సరానికల్లా సోలార్ విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేస్తూ ‘నెట్ జీరో ఎనర్జీ’ సంస్థగా అవతరించనున్నదని, ఈ మేరకు సంస్థ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ శుక్రవారం న్యూ ఢిల్లీ నుంచి నిర్వహించిన దేశవ్యాప్త బొగ్గు కంపెనీల సమీక్షా సమావేశంలో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన పాల్గొన్నారు. 2024 నాటికి ఏడాదికి తాను వినియోగిస్తున్న విద్యుత్కు సమానంగా 700 మిలియన్ యూనిట్ల సోలా ర్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ సరికొత్త మైలురాయిని చేరుకోనున్నదని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో 42 గనులు, దాదాపు 43 వేల మంది కార్మికులు, కాలనీల అవసరాల కోసం ప్రతి ఏడాది 700 మిలియన్ యూనిట్ల విద్యుత్ను తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో నుంచి కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నదన్నారు. ఈ విద్యుత్ ఖర్చులను పూర్తి స్థాయిలో తగ్గించుకోవడం కోసం సింగరేణిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను పెద్ద ఎత్తున నెలకొల్పనున్నట్లు చెప్పారు. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత చర్యగా ఇప్పటికే 224 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా నెలకొల్పి ఏడాదికి 350 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదని తెలిపారు. తద్వారా ఇప్పటికే సింగరేణి వినియోగిస్తున్న విద్యుత్లో 50 శాతం ఆదా చేకూరిందన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయనరావు, జీఎం కో ఆర్డినేషన్ ఎం సురేశ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, సింగరేణి సోలార్, థర్మల్ పవర్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.