కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23 : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు సంక్షేమం విషయంలో కూడా దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందని సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం అన్నారు. శనివారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన సెంట్రల్ వేడుకల్లో డైరెక్టర్(పా) ముఖ్యఅతిథిగా పాల్గొని సింగరేణి పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఇతర డైరెక్టర్లు, జీఎంలతో కలిసి వివిధ డిపార్ట్మెంట్లు ఏర్పాటుచేసిన స్టాల్స్ను ప్రారంభించారు. సింగరేణి డే వేడుకల పైలాన్ బెలూన్ను ఎగురవేశారు. సాయంత్రం జరిగిన సింగరేణి డే వేడుకల ముగింపు సభలో డైరెక్టర్(పా) బలరాం సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ సందేశాన్ని వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ మన సింగరేణి సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని, స్వాతంత్య్రం రాకముందు 58 సంవత్సరాల ముందే 1889 సంవత్సరంలో ఆవిర్భవించిందని చెప్పారు. 1921 డిసెంబర్ 23వ తేదీన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా రూపుదిద్దుకుందని వివరించారు. అప్పటినుంచి స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ సేవలో పాలుపంచుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థాయికి చేరుకుందన్నారు.
గత ఏడాది సింగరేని చరిత్రలోనే అత్యధికంగా 671 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 667 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం ద్వారా చరిత్రలోనే అత్యధికంగా రూ.33 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతో రూ.2222 కోట్ల లాభాలను ఆర్జించామని చెప్పారు. ఇందులో 32 శాతం లాభాల వాటా, కార్మికులకు బోనస్గా పంపిణీ చేసిన ఘనత సింగరేణికే దక్కుతుందన్నారు. దేశ విద్యుత్ అవసరాలను తీరుస్తుందన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో నిలబడాలంటే కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే ఆధారపడకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర రాష్ర్టాల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థ సింగరేణి మాత్రమేనని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్, లాభాల్లోనే కాకుండా సంక్షేమంలో కూడా ముందంజలో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపర్చిన అధికారులు, ఉద్యోగులతో పాటు వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనపర్చిన వారికి బహుమతులు అందించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరావు, పర్సనల్ జీఎంలు బసవయ్య, దీక్షితులు, కవితా నాయుడు, సూర్యనారాయణ, దామోదర్, హనుమంతరావు, అన్ని డిపార్ట్మెంట్ల జీఎంలు, ఏజీఎంలు , డీవైజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, డిసెంబర్ 23: సింగరేణి మణుగూరు ఏరియా పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో ఆవిర్భావ వేడుకలు శనివారం జరిగాయి. సింగరేణి పతాకాన్ని ఏరియా జీఎం దుర్గం రామచందర్ ఆవిష్కరించి, సింగరేణీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఎంతో పురోగతి సాధిస్తున్నదని, ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తున్నదని, విద్యుత్ ఉత్పాదకతో సత్తా చాటుతున్నదని అన్నారు. రక్షణ, పర్యావరణ పరిరక్షణలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుందని చెప్పారు. ఎస్వోటూ జీఎం వీసం కృష్ణయ్య, అధికారులతో కలిసి స్టాల్స్, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఆహూతులను సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఏజీఎం(సివిల్) వెంకటేశ్వర్లు, ఏఎస్వో వెంకటరమణ, పీకే ఓసీ పీవో లక్ష్మీపతి గౌడ్, ఎంఎన్జీఓసీ పీవో శ్రీనివాసాచారి, ఏజీఎం(కేపీయూజీ) వీరభద్రరావు, ఏజీఎం(ఈఅండ్ఎం) నర్సిరెడ్డి, డీవైసీఎంవో మేరీకుమారి తదితరులు పాల్గొన్నారు.