లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగడాన్ని దృష్టిలో పెట్టుకొని రైలు మార్గమే శ్రేయస్కరమని సింగరేణి సంస్థ భావించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం దక్షిణ మధ్య రైల్వేతో కలిసి బొగ్గు రవాణాకు తొలి రైలు మార్గం వేసింది. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ.618.55 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.309.39 కోట్లు వ్యయం చేసి కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైలుమార్గాన్ని నిర్మించింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు రైలుమార్గం ద్వారా 100 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది.
– భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : బొగ్గు రవాణా కోసం సింగరేణి సంస్థ తొలి రైలుమార్గం వేసింది. రోడ్డుమార్గంలో లారీల ద్వారా బొగ్గు రవాణా అత్యంత ప్రమాదకరం, పర్యావరణానికి హానికరంకావడంతో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు సింగరేణి యాజమాన్యం చేసిన ప్రయత్నం సఫలమైంది. దీంతో అటు రహదారులు పదిలంగా ఉండడంతోపాటు నిత్యం జరిగే ప్రమాదాలకు చెక్ పడింది. దక్షిణమధ్య రైల్వేశాఖతో సింగరేణి యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా ఒప్పందం చేసుకుని కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైలుమార్గాన్ని నిర్మించి గతేడాది తొలిసారిగా ప్రారంభించింది. దీంతో సత్తుపల్లి ఓసీ నుంచి వచ్చే బొగ్గు నేరుగా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నది. ప్రారంభించిన రెండేళ్లలోనే రైలుమార్గాన్ని పూర్తిచేసి రాకపోకలు ప్రారంభించారు. గత ఏడాది నుంచి ఈ రైలుమార్గం ద్వారా ఇప్పటికే 100 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో సింగరేణి సీఎండీ శ్రీధర్ చర్చించి ఇరుసంస్థల భాగస్వామ్యంతో 54 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 927.94 కోట్ల రూపాయల వ్యయంలో సింగరేణి రూ.618.55 కోట్లు, దక్షిణమధ్య రైల్వే రూ.309.39 కోట్లు చెల్లించడానికి అంగీకరించగా రైల్వేశాఖ ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరిలో నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ వ్యయఖర్చులను సింగరేణి సంస్థ ముందస్తుగానే చెల్లిస్తూ వచ్చింది. సీఎండీ శ్రీధర్ ఈ రైలుమార్గం నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతూ తరచూ పనుల ప్రగతిని సమీక్షించారు. రైలుమార్గం కోసం 355 హెక్టార్ల భూమిని సేకరించాల్సి రాగా భూసేకరణ విషయంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టు నిరాటంకంగా పూర్తయ్యేందుకు ప్రత్యేక కృషి చేశారు. భూమి కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కూడా అందజేశారు. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సింగరేణి చేసిన ప్రయత్నం ఫలించడంతో 54 కిలోమీటర్ల రైలుమార్గం సులభతరం అయ్యింది.
పర్యావరణహితంగా బొగ్గు రవాణా చేయాలన్న లక్ష్యంతో తమ భాగస్వామ్యంతో దక్షిణ మధ్య రైల్వే నిర్మించిన 54 కిలోమీటర్ల కొత్తగూడెం- సత్తుపల్లి రైలుమార్గం పూర్తయ్యింది. గత ఏడాది 2022 మార్చిలో సత్తుపల్లి నుంచి బొగ్గు లోడుతో తొలి రైలుబండిని కొత్తగూడెం వరకు ట్రయల్ రన్ వేసి ప్రారంభించారు. సత్తుపల్లి వద్ద ఉన్న జేవీఆర్ ఓపెన్కాస్ట్ గనులు, కిష్టారం ఓసీ నుంచి రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు అంటే ఏడాదికి వంద లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసే లక్ష్యంతో ఈ రైలుమార్గాన్ని నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారం, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూశాఖ, రైతులు, ప్రజల సహకారంతో విజయవంతంగా ఈ నిర్మాణం పూర్తవడంతోపాటు అతితక్కువ సమయంలో పనులు పూర్తికావడం విశేషం. సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలో సత్తుపల్లి వద్ద జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల నుంచి పెద్దఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే సుమారు 25నుంచి 30 వేల టన్నుల బొగ్గును ప్రస్తుతం వందలాది లారీల ద్వారా అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం(రుద్రంపూర్) ఆర్సీహెచ్పీకి రవాణా చేసి అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా పాల్వంచ థర్మల్ పవర్స్టేషన్కు, ఇతర రాష్ర్టాల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, పరిశ్రమలకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఈ రైలుమార్గంలో హైదరాబాద్, విజయవాడ హైవేల మీద భారీ రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అదేవిధంగా సత్తుపల్లి సమీపంలో సీతారామ ప్రాజెక్టు కాలువపై కూడా పొడవైన రైలువంతెనను నిర్మించారు. వీటితో కలిపి మొత్తం 10 ఈ తరహా పెద్ద వంతెనలు నిర్మించారు. ఇవికాకుండా కాలువలు, వాగులు, వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై 44 మైనర్ బ్రిడ్జిలు, 31 రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఏడు రైలు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కలిపి మొత్తం 102 బ్రిడ్జిలు నిర్మించారు.
ఈ రైలుమార్గంలో హైదరాబాద్, విజయవాడ హైవేల మీద భారీ రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అదేవిధంగా సత్తుపల్లి సమీపంలో సీతారామ ప్రాజెక్టు కాలువపై కూడా పొడవైన రైలువంతెనను నిర్మించారు. వీటితో కలిపి మొత్తం 10 ఈ తరహా పెద్దవంతెనలు నిర్మించారు. ఇవికాక కాలువలు, వాగులు, వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై 44 మైనర్ బ్రిడ్జిలు, 41 రైల్ అండర్ బ్రిడ్జిలు, 7 రైల్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు.
దేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల వారు తమ అవసరాల కోసం రైల్వేశాఖ వారితో కలిసి రైలుమార్గాలు నిర్మించారు. అయితే రాష్ట్రంలో సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద రైలుమార్గం మాత్రం ఇదే అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన ఈ రైలుమార్గం వల్ల సత్తుపల్లి- కొత్తగూడెం మధ్య ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు కాలుష్యం, ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. రైలుమార్గం అందుబాటులోకి రావడం వల్ల వినియోగదారులకు వేగంగా సురక్షితంగా నాణ్యమైన బొగ్గు అందుతున్నది.
ఇదిలాఉండగా ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన రైలుమార్గం సత్తుపల్లికి సమీపంలో లంకపల్లి వద్ద ముగుస్తుండగా అక్కడి నుంచి సింగరేణి గనుల వద్ద నిర్మించిన సీహెచ్పీ వరకు ఉన్న 3.2 కిలోమీటర్ల రైలుమార్గాన్ని సింగరేణి సంస్థ సొంతంగా నిర్మించింది. సీహెచ్పీ యార్డులో అవసరమైన మరిన్ని లైన్లు కూడా నిర్మించింది. ఈ విధంగా మొత్తం మీద 10.17 కిలోమీటర్ల రైలుమార్గాన్ని సింగరేణి సంస్థ 180 కోట్ల రూపాయలను వెచ్చించి స్వయంగా నిర్మించింది. కాగా రైలు లోడింగ్ కోసం రూ.470 కోట్లతో సింగరేణి సంస్థ అత్యాధునిక పర్యావరణహిత సీహెచ్పీని ఇక్కడ నిర్మించింది. ఏడాదికి 100లక్షల టన్నుల బొగ్గు లోడింగ్ జరిపే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. దీనివల్ల నిర్దిష్టమైన గ్రేడ్ బొగ్గును వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం ఏర్పడింది. దీంతో సింగరేణిపై అదనపు భారం పడింది.
రైలుమార్గం లేనప్పుడు సత్తుపల్లి నుంచి ప్రతి రోజూ టిప్పర్ల ద్వారా బొగ్గు సరఫరా జరిగేది. రోజుకు 120 లారీలు నడిచేవి. నిత్యం లారీలు తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉండేవి. రోడ్లు కూడా పాడైపోయేవి. చాలా నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో అవసరాలను గుర్తించిన యాజమాన్యం చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయం తీసుకుంది. ఈ రైలుమార్గంతో సత్తుపల్లి, ఆర్సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణా నేరుగా ఆయా ప్లాంట్లకు సరఫరా అవుతున్నది.
– సాలెంరాజు, ఏరియా జీఎం, రుద్రంపూర్
చరిత్రలో నిలిచిపోయే రైలుమార్గం ఇది. సింగరేణిలో ఎక్కడా లేదు. తొలి రైలుమార్గం ఇదే. రోజుకు వెయ్యి ట్రిప్పులు టిప్పర్లు బొగ్గును తీసుకొచ్చేవి. 2018లో రైలుమార్గం పనులు ప్రారంభించడం జరిగింది. సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రెండేళ్లలోనే పనులు పూర్తికావడం విశేషం. ఒక గూడ్స్ ట్రిప్ వెళ్తే 52 రేకులు బొగ్గు సరఫరా అవుతుంది. పర్యావరణం ఇప్పుడు చాలా బాగుంది. అదే లక్ష్యంతో సింగరేణి ముందుకు వెళ్తున్నది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇది తొలి విజయం అని చెప్పాలి.
– బలరాం, సింగరేణి డైరెక్టర్, కొత్తగూడెం