కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 16 : సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టనున్న గనుల కోసం పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్లాల్ మీనా హామీ ఇచ్చారు. సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని, ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందుండడంపై ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన సంస్థ సీఎండీ బలరాం, ఇతర డైరెక్టర్లతో కంపెనీ ప్రగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రస్తుత పనితీరు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎండీ బలరాం వివరించారు.
సింగరేణి ప్రాంతంలోని మూడు బొగ్గు బ్లాకుల కేటాయింపు సింగరేణి సంస్థకే కేటాయించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న కాలంలో చేపట్టనున్న కొత్త గనులకు త్వరితగతిన అనుమతులు లభించేలా చూడాలన్నారు. దీనిపై కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి స్పందిస్తూ.. నిబంధనలకు లోబడి సింగరేణికి మేలు కలిగే విధంగా తగిన సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి రూపేందర్ బ్రార్, డిప్యూటీ డైరెక్టర్ సంతోశ్, సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వర్రెడ్డి, ఈడీ జే.ఆల్విన్ పాల్గొన్నారు.