భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు సింగరేణీయులంతా అంకితభావంతో పనిచేద్దామని, ప్రతి ఒక్క రోజును విలువైనదిగా భావించి ముందుకెళ్లాలని సీఎండీ బలరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలు, ఉన్నతాధికారులతో శుక్రవారం రోజువారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్టు, కంటీన్యూయస్ మైనర్లు, సీహెచ్పీలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన దిశా నిర్దేశం చేశారు. రానున్న వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండే విధంగా రోజుకు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు. రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని ఆదేశించారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్బర్డెన్ తొలగింపు, ఆశాజనకంగా ఉన్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో ఈ ఏడాది ఇప్పటివరకు 5.15 శాతం వృద్ధి, రవాణాలో 8 శాతం వృద్ధి, ఓవర్ బర్డెన్ తొలగింపులో 6 శాతం వృద్ధి సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న మూడు నెలల్లో సమష్టిగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమీక్షలో సంస్థ డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వరరెడ్డి, ఈడీ (సీఎం) ఆల్విన్, జీఎం కో-ఆర్డినేషన్ సురేష్, జీఎం సీపీపీ జక్కం రమేశ్, జీఎం ఎంపీ మల్లెల సుబ్బారావు, జీఎం మార్కెటింగ్ దేవేందర్, జీఎం సివిల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.