భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : యాసంగి సాగు విషయంలో భద్రాద్రి జిల్లాలోనూ అదే తీరు కన్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా నిరుడు 60 వేలకుపై చిలుకు ఎకరాల్లో యాసంగి సాగు జరుగగా.. సాగునీరు లేని కారణంగా అది ఈ ఏడాది కేవలం 36 వేల ఎకరాలకే పరిమితమైంది. రెండు లేదా మూడు ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులకు మినహా అంతకుమించిన విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు. దీంతో చాలా మంది రైతులు యాసంగి సాగుకు మొగ్గు చూపలేదు. కొందరు రైతులు మాత్రం ధైర్యం చేసి పామాయిల్ సాగు వైపు మళ్లారు. ప్రత్యేకంగా పరిశీలిస్తే.. పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో తుమ్మలచెరువు కింద నిరుడు 8,500 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు.
కానీ.. ఈ ఏడాది దానిని 4,200 ఎకరాలకే పరిమితం చేశారు. అలాగే, కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి సర్వారం గ్రామంలో పంట పొలాల్లో మోటర్లు ఉన్నా కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. నీరులేని కారణంగా ఒక రైతు టమాట తోట ఎండిపోయింది. అదే మండలం ఉప్పరిగూడెంలో హరి అనే మరో రైతు కూడా బోరులో నీరు లేని కారణంగా ఈసారి సాగు మానేశాడు. సింగభూపాలెం చెరువులో నీటిమట్టం తగ్గడంతో కాలువలోకి నీరు రావడం లేదు. దీంతో దాని ఆయకట్టు కింది అంజనాపురం రైతులు కూడా యాసంగిపై ఆసక్తి చూపలేదు.
పంట వేయాలంటే 24 గంటలూ కరెంటు ఉండాలి. కానీ.. ఇప్పుడు కరెంటే సక్కంగ రావట్లేదు. ఎప్పుడు వస్తంతో ఎప్పుడు పోతందో తెలియట్లేదు. అందుకే ఈసారి పంట వేయలేదు. వానకాలంలో పత్తి వేశాం. అది చేతికొచ్చింది. దాన్ని తీసేసి యాసంగిలో కూరగాయలు సాగు చేద్దామంటే నీళ్ల సమస్య వస్తంది. కరెంటు సక్కంగుంటే కూరగాయల పంటలు వేసేవాళ్లం. కరెంటు రాకపోతే పంట ఎండిపోతదని ఈసారి బీడుగానే వదిలేశాం. కాలువలు, చెరువుల్లో కూడా నీళ్లు లేవు.