భద్రాచలం, డిసెంబర్ 28 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన కార్తీక పునర్వసు దీక్షలు గురువారం ముగిశాయి. దీక్షా విరమణను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి రామాలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున పావన గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామాలయానికి చేరుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణాలు జరిపే బేడా మండపంలో శ్రీరామ మాలధారులు తిరువడి సామగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పాదుకలకు విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన జరిపించారు.
ఈవో రమాదేవి తన శిరస్సుపై శ్రీరామ పాదుకలతో భద్రగిరి ప్రదక్షిణ చేశారు. అయితే ఈ ఏడాది నగర ప్రదక్షిణ చేయలేదు. దీంతో భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చేందుకు వేచిఉండి ఎంతకు రాకపోవడంతో నిరాశ చెందారు. గత 15ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని ఆలయ అధికారులు విస్మరించడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామభక్తులు భద్రుడి కోవెలలో తిరువడి సమర్పించారు. సాయంత్రం స్వామివారికి వెండి రథోత్సవం వైభవంగా జరిగింది.
కార్తీక పునర్వసు దీక్షలు ముగిసిన మరుసటిరోజు శ్రీరామదీక్షాపరులతో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. అందులో భాగంగా శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణం పూర్తయిన తరువాత అదే వేదికపై స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు.