మామిళ్లగూడెం, మే 4 : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అదనపు ఈవీఎం యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎం తరలింపు కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి శనివారం పరిశీలించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్కు కేటాయించిన 888 బ్యాలెట్ యూనిట్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల, పొన్నెకల్, పాలేరుకు కేటాయించిన 725 బ్యాలెట్ యూనిట్లను శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల, మధిరకు కేటాయించిన 670 బ్యాలెట్ యూనిట్లు మధిర పాలిటెక్నిక్ కళాశాల, వైరాకు కేటాయించిన 630 బ్యాలెట్ యూనిట్లు వైరా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, సత్తుపల్లికి కేటాయించిన 735 బ్యాలెట్ యూనిట్లు జ్యోతి నిలయం హైసూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సంబంధిత అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈవీఎంల కేటాయింపు పూర్తి
పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎం యంత్రాల కేటాయింపు పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి కోల్టేతో కలిసి ఈవీఎం యంత్రాల రెండోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించిన రిజర్వ్ ఈవీఎం యంత్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి కేటాయించిన ఈవీఎం యంత్రం మాత్రమే పోలింగ్కు వినియోగిస్తారని, ఈవీఎం మరమ్మతుకు గురైతే రిజర్వులో ఉన్న ఈవీఎంను ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చీకటి రాంబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ.గోపాల్రావు, బీజేపీ ప్రతినిధి జీఎస్ఆర్ఏ విద్యాసాగర్, స్వతంత్ర అభ్యర్థులు చిట్టిమల్లు, జోగ్రామ్, ఎం.రవిచందర్హాన్, పార్టీల, అభ్యర్థుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ; ఖమ్మం జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేటర్ సెంటర్ను శనివారం ఆయన పరిశీలించారు. ఓటర్ల రిజిస్ట్రేషన్, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చూడాలన్నారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ.. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పోలింగ్ ఫ్లయింగ్ స్కాడ్ తదితర నిఘా బృందాలు, మైక్రో పరిశీలకులు, పోలీస్ సెక్టార్ అధికారులు, సిబ్బంది మొత్తం 10,907 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు ఈ నెల 8 వరకు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.