లక్ష్మీదేవిపల్లి, జనవరి 4: గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక్యంగా సరుకును రాష్ర్టాల సరిహద్దులు దాటిస్తున్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని రేగళ్ల క్రాస్రోడ్డులో గురువారం పోలీసులు రూ.వేలు కాదు… రూ.లక్షలు కాదు.. ఏకంగా రూ.1.62 కోట్ల విలువైన 6.5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్లో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ విలేకర్లకు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్లోని నాగూర్ జిల్లా అలాయి గ్రామానికి చెందిన సుందర్రామ్ అనే లారీ డ్రైవర్, ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే లారీ క్లీనర్ గత నెల 22న వారి స్థానిక జిల్లా నుంచి లారీలో తినుబండారాల లోడ్తో బయల్దేరారు.
28వ తేదీ సాయంత్రం ఏపీలోని రాజమండ్రికి వచ్చి సరుకు అన్లోడ్ చేశారు. అనంతరం 31వ తేదీన సూత్రధారుడైన రాజస్థాన్లోని బీజ్వీర్ జిల్లా నోఖా ప్రాంతానికి చెందిన ఓంప్రకాష్ సూచనల మేరకు ఏపీలోని చింతూరు ప్రాంతంలో గంజాయి సేకరించేందుకు బయల్దేరారు. సరుకు సిద్ధంగా లేకపోవడంతో ఈ నెల 3వ తేదీ వరకు అక్కడే ఉన్నారు. ఇదే రోజు 6.5 క్వింటాళ్ల సరుకును అక్కడ రూ.8 లక్షలకు కొని లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక అరలో ఉంచి రాజస్థాన్కు తరలిస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో లారీ లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల క్రాస్రోడ్డు దాటుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని సోదా చేశారు. లారీలో భారీగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.62 కోట్ల వరకు ఉంటుందని, ఇద్దరు నిందితుల నుంచి నాలుగు మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. అనంతరం భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.