పాల్వంచ రూరల్, మే 29 : వానకాలం సీజన్లో వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో పత్తి, వరి, మిర్చి పంటలు వేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, వాటికి సరిపడా విత్తనాలు కూడా సిద్ధం చేశామన్నారు. ఈ సీజన్లో పత్తి 2లక్షల 60వేల ఎకరాల్లో సాగు చేయాలని అంచనా వేశామని, దీనికోసం 5లక్షల పత్తి ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం రైతులు 35వేల ప్యాకెట్లను రైతులు తీసుకున్నారన్నారు. లక్షా 60వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు అంచనా వేయడం జరిగిందని, దీనికి 40వేల క్వింటాళ్ళ విత్తనాలు అవసరమని, ఇవి కుడా అందుబాటులో ఉన్నాయన్నారు. మిర్చి 30వేల ఎకరాల్లో సాగు చేసేందుకు అంచనా కాగా 32 వేల పత్తి విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. విత్తనాల విషయంలో రైతులు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. జీలుగు విత్తనాలు 2,600 క్వింటాళ్లు జిల్లాలోని అన్ని సహకారసంఘాల్లో అందుబాటులో ఉంచామన్నారు. పిల్లిపెసర విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రెండు దుక్కుల వర్షం తర్వాత పత్తి విత్తనాలు వేసుకుంటే అన్ని మొలకెత్తుతాయన్నారు. ఏ సమస్యవచ్చినా వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఏవో శంకర్ పాల్గొన్నారు.