ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 17: మండలంలోని తీర్థాల జాతర మరో నాలుగు రోజులపాటు జరుగనుందని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ జాతర పూర్తయ్యేంత వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని తీర్థాల గ్రామంలో సంగమేశ్వర జాతర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వారు శనివారం దేవాలయాన్ని సందర్శించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. తొలుత తహసీల్దార్, జాతర పర్యవేక్షణ అధికారి తాళ్లూరి సుమ జాతర నిర్వహణ, భక్తులకు అందజేయనున్న సేవల గురించి వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మున్నేరు వాగులోకి మరింత వరదనీరు వస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ ఈఈ వెంకటేశ్వర్లుకు సూచించారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దుమ్ము, ధూళి లేవకుండా నిరంతరం నీటితో శుభ్రం చేయాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యర్థం ఆర్టీసీ అధికారులు సుమారు 50 బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సురక్షితమని అన్నారు. ప్రశాంత వాతావరణంలో జాతర కొనసాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ బోస్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు రామోజీ రమేశ్, బెల్లం ఉమ, యండపల్లి వరప్రసాద్, శ్రీనివాస్, అంజలి, జాటోత్ శాంత, బాలునాయక్, వెంకటరెడ్డి, నల్లమోతు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.