ఖమ్మం వ్యవసాయం, మార్చి 12 : రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతునేస్తం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని వీ వెంకటాయపాలెం, కూసుమంచి, బోనకల్, తనికెళ్ల, కొర్లగూడెం రైతువేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి 414 మంది రైతులతోపాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.విజయనిర్మల, ఆయా డివిజన్, మండల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
రైతులు ఎదుర్కొనే సమస్యలను శాస్త్రవేత్తల ద్వారా అవసరమైన సమాచారం తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మామిడిపిందె రాలుడు-నివారణ చర్యలపై ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి సీనియర్ శాస్త్రవేత్త సుచరిత అవగాహన కల్పించారు. అధిక ఉష్ణోగ్రత ప్రభావంతో కలిగే నష్టాల నివారణపై జగిత్యాల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాస్, సేంద్రియ వ్యవసాయ సాగుపై శాస్త్రవేత్త సీహెచ్ ప్రగతికుమారి వివరించారు.