ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 11: దాదాపు నెలన్నర వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. తమ పిల్లలను పాఠశాలలను పంపించేందుకు తల్లిదండ్రులు సర్వం సిద్ధం చేసుకుంటుండగా.. పాఠశాలలను శుభ్రం చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. బ్యాగులు, పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు కొనుగోలు చేస్తుండడంతో ఆయా దుకాణాల వద్ద సందడి నెలకొంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యాశాఖ ఏటా నిర్వహించే బడిబాటతోపాటు ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నది.
రోజుకో కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా బడిబాట కార్యక్రమం ఈ నెల 3 నుంచి కొనసాగుతున్న విషయం విదితమే. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీల భాగస్వామ్యంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు 17 వరకు బడిబాట చేపట్టనున్నారు. ప్రతి పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా 5 నుంచి 10 శాతం పెంచాలనే లక్ష్యాలను విద్యాశాఖ ఉపాధ్యాయుల ముందుంచింది.
12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా మన ఊరు-మన బడి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ప్రత్యేక అవసరాల పిల్లలకు కార్యక్రమాలు, 16న ఆంగ్ల మాధ్యమంపై అవగాహన, 17న బాలికా విద్యతోపాటు కెరీర్ గైడెన్స్, 19న తెలంగాణ గ్రీన్ ఫెస్టివల్, 20వ తేదీన విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు.
పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు సిద్ధం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులు, పాఠ్య, నోట్ పుస్తకాలను సిద్ధం చేశారు. ఈసారి అదనంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్ బుక్స్, 6 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నోట్ బుక్స్ అందించనున్నారు. వీటిని ఆయా పాఠశాలలకు ఇప్పటికే చేర్చారు. 6, 7వ తరగతి విద్యార్థులకు 6, 8వ తరగతి విద్యార్థులకు 7, 9, 10వ తరగతి విద్యార్థులకు 14 చొప్పున నోట్ పుస్తకాలు అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు 3,44,746 లాంగ్ నోట్బుక్స్ అందించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 3 వర్క్బుక్స్ చొప్పున పంపిణీ చేయనున్నారు.
విద్యా దినోత్సవానికి సన్నద్ధత
ఈ నెల 20న తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిభ కనబరిచిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతోపాటు పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావడంలో సహకరిస్తున్న తల్లిదండ్రులు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరిస్తారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఫొటో ప్రదర్శన ఉంటుంది.
ప్రైవేట్ స్కూల్స్ సన్నద్ధత
ప్రభుత్వం జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12న పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. పాఠశాలలకు హాజరుకావాలని ఇప్పటికే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించారు. పుస్తకాలు, యూనిఫాంలను విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోలు చేస్తున్నారు.