– ఏఎంఓ పెసర ప్రభాకర్ రెడ్డి
కారేపల్లి, ఏప్రిల్ 09 : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్నత పాఠశాల తొడితలగూడెం, ప్రాథమిక పాఠశాల పంతులునాయక్తండాను ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న పౌండేషనల్ లిటరసీ, న్యూమరసి బోధన అభ్యసన ప్రక్రియలను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా అమలు పరచబడుతున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా మానిటరింగ్ అధికారి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఫైవ్ ప్లస్ వన్ సిస్టం అమలులో ఉందన్నారు. పిల్లలలో అభ్యాసం పెరగటానికి పాఠ్య పుస్తకాలు, వర్కు బుక్కులను సమన్వయం చేస్తూ బోధనాభ్యసన ప్రక్రియలను నిర్వహించాలన్నారు. తరగతి గదులలో జరిగే నాణ్యమైన బోధన ద్వారా మాత్రమే విద్యార్థులు వారి తల్లిదండ్రులు బడుల వైపు ఆకర్షితమవుతారన్నారు. మానిటరింగ్ అధికారి వెంట సీఆర్పీ కిశోర్ బాబు ఉన్నారు.