కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 25: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు- మన బడి’ అమలు చేయనున్నది. బడుల్లో మౌలిక వసతులకు కల్పించనున్నది. ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నది. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాలో 1,064 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. విద్యార్థులకు తాగునీటి వసతి, టాయిలెట్ల ఆధునీకరణ, ల్యాబ్ సౌకర్యం వంటి మౌలిక వసతులు సమకూరనున్నాయి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కో రంగాన్ని బలోపేతం చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా ప్రభుత్వ బడుల బలోపేతానికి కంకణం కట్టుకున్నారు. మూడు విడతల్లో వేలాది కోట్లు ఖర్చు చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలకు ‘ఇంగ్లిష్’ అందిచనున్నారు. బడుల అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అబివృద్ధి నిధుల నుంచి 40 శాతం నిధులను వినియోగించే అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్స్, పంచాయతీరాజ్శాఖ నుంచీ నిధులు కేటాయించనున్నారు. పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతల సాయం తీసుకోనున్నారు.
గతంలోనూ దాతల సాయం..
మంచి పని చేస్తామంటే దాతలెవరైనా ముందుకు వస్తారు. సంకల్పించిన పనికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారు. ‘మన ఊరు- మన బడి’ అమలు కాకమునుపే ఎన్నో పాఠశాలల అభివృద్ధికి దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సహకరించారు. వారి సాయంతో జిల్లాలో ఇప్పటికే అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరాయి. జిల్లాలోని ముఖ్యంగా బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల, పాల్వంచ (కేటీపీఎస్) జడ్పీ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కూలీలైన్ ఉన్నత పాఠశాల, భద్రాచలం జడ్పీ సెకండరీ పాఠశాల, ఎర్రగుంట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి నవభారత్, ఐటీసీ, విధాని, చేతన్ ఫౌండేషన్, డీఎంఎఫ్, చిరాగ్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించాయి. విద్యార్థులకు విద్యా సామగ్రి, టాయిలెట్లు, సైన్స్ ల్యాబులు, బెంచీలు సమకూర్చాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నాయి. భారీ పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కొత్తగూడెంలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థులు, ప్రజాప్రతినిధులు మౌలిక వసతులు కల్పించారు. 200 మంది విద్యార్థులకు పైప్లైన్ ద్వారా సింగరేణి నుంచి తాగునీరు అందుతున్నది. 1976-77 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 20 కుర్చీలు, స్కూల్ బోర్డు ఏర్పాటు చేయించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇందిరానగర్కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి దాతల సాయం అందింది. సీఎం కేసీఆర్ పిలుపు అందుకుని ‘మన ఊరు- మన బడి’కి భారీగా దాతల సాయం అందుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇందిరానగర్ స్కూల్కు జాతీయ అవార్డు..
లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు ఒకప్పుడు కేవలం పది మంది పిల్లలు మాత్రమే వచ్చేవారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, అధునాతన టాయిలెట్లు నిర్మించడం, పిల్లలకు ఆట వస్తువులు సమకూర్చడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. సింగరేణి సంస్థ తోడ్పాటుతో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ అందింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘వాష్’ అనే పురస్కారానికి ఈ పాఠశాల ఎంపికైంది. ఈ మేరకు 2018లో సెప్టెంబర్ 5న ప్రధాని మోదీ నుంచి హెచ్ఎం జ్యోతిరాణికి అభినందన లేఖ అందింది. స్వచ్ఛత, పరిశుభ్రత విభాగంలోనూ పాఠశాల పురస్కారం అందుకున్నది. ‘మన ఊరు- మన బడి’ అమలైతే ప్రభుత్వ బడులు ఇలాంటి విజయాలెన్నింటినో సొంతం చేసుకుంటాయి.
ఆంగ్ల మాధ్యమాన్ని స్వాగతించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులందరికీ ఇంగ్లిష్ మీడియం అవసరం. ‘మన ఊరు.. మన బడి’తో నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. తల్లిదండ్రులకు పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపే అగత్యం తప్పుతుంది. ప్రభుత్వ బడులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తే ప్రజలంతా ఆహ్వానిస్తారు. నిరుపేదలకు ఏటా కొన్ని వేల రూపాయల ఫీజులు మిగులుతాయి. ఇంగ్లిష్ మీడియం చదివే పిల్లలు మున్ముందు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.