సత్తుపల్లి, ఏప్రిల్ 28: ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పేరుతో కేంద్రం ప్రభుత్వం నిరుడు ప్రవేశపెట్టిన పథకానికి సత్తుపల్లి పట్టణంలోని పాతసెంటర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఓల్డ్ యూపీఎస్) ఎంపికైంది. ఈ పథకానికి దేశవ్యాప్తంగా 14 వేల పాఠశాలలు ఎంపిక కాగా.. తెలంగాణ నుంచి వివిధ రకాలకు చెందిన 543 పాఠశాలలు, అందులోనూ ప్రాథమిక పాఠశాలల నుంచి 56 స్కూళ్లు ఎంపికయ్యాయి. ఈ 56 పాఠశాలల్లో ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి పాతసెంటర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఓల్డ్ యూపీఎస్) కూడా ఉంది. పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు, విద్యార్థుల సంఖ్య, సాధిస్తున్న విద్యా ప్రమాణాలు, పాఠశాల యాజమాన్య కమిటీ పనితీరు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులు ఈ పాఠశాలను ఎంపిక చేశారు.
ఈ పథకం కింద ఎంపిక స్కూళ్లకు పాఠశాల అవసరాలు, మౌలిక వసతులు, సాంకేతిక సామగ్రి కోసం ఏడాదికి రూ.40 లక్షల చొప్పున ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుంది. ఇటీవల ఈ పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన ప్రత్యేక ఏవీ ద్వారా అన్నింటినీ తిలకించారు. ఈ సందర్భంగా హెచ్ఎం చిత్తలూరి ప్రసాద్ను, ఉపాధ్యాయులను, యాజమాన్య కమిటీ సభ్యులను అభినందించారు. కాగా, ప్రతిష్ఠాత్మకమైన ప్రధానమంత్రి-శ్రీ పథకానికి తమ పాఠశాల ఎంపిక కావడం పట్ల హెచ్ఎం చిత్తలూరి ప్రసాద్, ఉపాధ్యాయులు నాగమణి, జయశ్రీ, లాల్ అహ్మద్, పవన్, నర్సింహారావులు హర్షం వ్యక్తం చేశారు.