సత్తుపల్లి టౌన్, మే 29: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సత్తుపల్లిలో ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా అది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అమలయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేస్తున్నారని, ఇది నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రతి కార్యక్రమాన్నీ వినూత్నంగా చేపడుతున్నామన్నారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా నారాయణపురంలో కేసీఆర్ రూపంలో విత్తనాలను మొలకెత్తించడం రాష్ర్టానికే గుర్తింపు తెచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కళ్లకు కట్టేలా ప్రజలకు చూపించే విధంగా 220 అడుగుల ఫ్లెక్సీని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోనే సత్తుపల్లి దిక్సూచిగా మారిందని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో సైతం ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని కరపత్రాల ద్వారా ముద్రించి సమావేశంలో పంపిణీ చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించి ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో ఇదే తరహాలో కొనసాగించాలని సూచించారన్నారు.
ఇదే తరహాలో దశాబ్ది ఉత్సవాలను రోజువారీ జరిగే కార్యక్రమాలతోపాటు వినూత్న రీతిలో నిర్వహించి రాష్ర్టానికి సత్తుపల్లి నియోజకవర్గాన్ని మోడల్గా నిలపాలని కోరారు. 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండి వాటిని ప్రజలకు వివరించాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ సుజాత, ఏసీపీ రామానుజం, సీఐ నాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారామ్, ఫారెస్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఐదు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.