తల్లాడ, అక్టోబర్ 13: ’60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదు.. కేవలం తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది.. కాబట్టి ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉంది.’ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఆయన అంబేద్కర్నగర్, మల్సూర్తండా, రంగం బంజర, లక్ష్మీపురం గ్రామాల్లో విస్తృత పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. గ్రామగ్రామాన ప్రజలకు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు.
అనంతరం పలుచోట్ల నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. సీఎం కేసీఆర్ అడగకుండానే అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ఐకాన్గా తీర్చిదిద్దానన్నారు.
ప్రజలు ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, మరోసారి గెలిపించి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఎస్సీకి పథకం వర్తిస్తుందన్నారు. దళితబంధుపై అపోహలు ఉంటే ఎవరైనా చింతకాని మండలంలో పథకం ద్వారా యూనిట్లు పొందిన వారి జీవితాలను పరిశీలించవచ్చన్నారు. గ్రామాల్లో అవసరమైన ప్రతిచోట కమ్యూనిటీహాల్స్, రోడ్లు నిర్మించామన్నారు.
వచ్చే నెలలో కల్లూరు జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. అనంతరం లక్ష్మీపురంలో ఒకే ఇంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన ఇద్దరిని ఎమ్మెల్యే సన్మానించారు. మృతురాలు మరియమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దుగ్గిదేవర వెంకట్లాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు జొన్నలగడ్డ కిరణ్బాబు, షేక్ బాబు, ఓబుల సీతారామిరెడ్డి, శీలం కోటారెడ్డి, కేతినేని చలపతిరావు, దిరిశాల దాసురావు, నాయుడు శ్రీనివాసరావు, బద్ధం కోటిరెడ్డి, బానోతు మోహన్, జీవీఆర్, బొడ్డు వెంకటేశ్వరరావు, కోడూరి వీరకృష్ణ, దూపాటి నరేష్రాజు, శీలం శ్రీనివాసరెడ్డి, పమ్మి కృష్ణ పాల్గొన్నారు.