సత్తుపల్లి టౌన్, జూన్ 5: సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి మాత్రమేనని అన్నారు. ఇలాంటి సంస్థను ప్రైవేటీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ఈ కుట్రలను కార్మికులు, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సింగరేణి వేడుకల్లో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ తన లాభాల్లో 30 శాతాన్ని కార్మికులకు వాటాగా ఇస్తోందని అన్నారు. తెలంగాణ రాకముందు 18 శాతంగా ఉన్న వాటాను స్వరాష్ట్రం సిద్ధించాక 30 శాతానికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. దేశంలో లాభాల్లో నడుస్తున్న గొప్ప ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అని, అది తెలంగాణలో ఉన్నందుకు ప్రతి తెలంగాణ బిడ్డా గర్వపడాలని అన్నారు. సత్తుపల్లి ప్రాంతంలో రేజర్ల, కిష్టారం, జగన్నాథపురం, కొమ్మేపల్లి సహా పట్టణ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను సింగరేణి నిధులతోనే చేపట్టినట్లు తెలిపారు.
నష్టపోయిన వారిని ఆదుకుంటాం: కలెక్టర్ గౌతమ్
సింగరేణి గనుల్లో బొగ్గు వెలికితీత కోసం జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్ కారణంగా సత్తుపల్లి ప్రాంతంలో కిష్టారం బీసీ, ఎస్సీ కాలనీలు, పట్టణంలోని వెంగళరావునగర్, ఎన్టీఆర్నగర్, ద్వారకాపురి తదితర ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్యే వెంకటవీరయ్య తన దృష్టికి తీసుకువచ్చారని కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఈ విషయమై త్వరలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బ్లాస్టింగ్ కారణంగా నష్టపోయిన ఇళ్ల యజమానులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ముందుగా సింగరేణి అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. సింగరేణి కార్మికుల కుటుంబసభ్యులు తయారుచేసిన తెలంగాణ వంటకాలను పరిశీలించారు. అనంతరం భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రమేష్, సూర్యనారాయణ, రామానుజం, కూసంపూడి మహేశ్, సుజాత, హైమావతి, వాసు, వెంకటాచారి, నర్సింహారావు పాల్గొన్నారు.