తల్లాడ, అక్టోబర్ 6: అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని సత్తుపల్లి ఎమ్మెలే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు, దళితబాంధవుడిగా నిలిచారని అన్నారు. తల్లాడ మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. పలు గ్రామాల్లో ప్రజలు నిర్వహించిన దళితబంధు సంబురాల్లోనూ, సర్వేల్లోనూ పాల్గొన్నారు. రామానుజవరం గ్రామంలో సర్పంచ్, వైస్ ఎంపీపీ దంపతులు శీలం కోటారెడ్డి, శివపార్వతి వినూత్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ఫ్లెక్సీలకు గ్రామస్తుల సమక్షంలో పుష్పాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. అడిగిందే తడవుగా సత్తుపల్లి నియోజకవర్గానికి దళితబంధు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. పంటలు ఎండిపోతున్నాయంటూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన.. సాగర్ ఎడమ కాలువకు సాగర్ జలాలు విడుదల చేయించి నియోజకవర్గంలోని రైతుల పంటలకు నీళ్లు అందించారని గుర్తుచేశారు. ప్రజలు ఆలోచించాలని, అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను, తనను ఆశీర్వదించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయప్రసాద్, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దూపాటి భద్రరాజు, శీలం కోటారెడ్డి, శీలం శివపార్వతి, అయిలూరి ప్రదీప్రెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరిరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.