ఖమ్మం, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ‘ఆరోగ్యలక్ష్మి’ పథకంతో లబ్ధిదారులకు దొడ్డు బియ్యం నుంచి విముక్తి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. వచ్చేనెల మొదటివారం నుంచి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకూ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అంగన్వాడీల్లో భోజనం చేసే గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ చిన్నారులకు సన్నబియ్యాన్ని అందించనుండడంతో సర్కారు నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఖమ్మం జిల్లాలో 39 వేల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు లబ్ధి చేకూరనున్నది. వీరిలో 15,900 మంది గర్భిణులు, బాలింతలు, 23,636 మంది చిన్నారులు ఉన్నారు.
మాతా శిశువుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం సత్ఫలితాలిస్తోంది. దీంతో ఆ పథకం ద్వారా మరింత ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. ఇందుకోసం ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ పథకంపై తొలి సంతకం చేసిన విషయం విదితమే. దీంతో వచ్చే నెల మొదటివారం నుంచి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకూ సన్నబియ్యం పంపిణీ కానున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం అందుతోంది. మధ్యాహ్న భోజనంతోపాటు ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు, 200 గ్రాముల పాలు అందిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతాన్ని కూడా అందిస్తున్నారు. అంగన్వాడీల్లో భోజనం చేసే గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ చిన్నారులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా బీఆర్ఎస్ సర్కారు ఇక నుంచి సన్నబియ్యాన్ని అందించనుంది. దీంతో 1,800 కేంద్రాల్లోని సుమారు 39 వేల మంది లబ్ధిపొందనున్నారు. సర్కారు నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి రోజూ 39 వేల మందికి ప్రయోజనం
సన్నబియ్యం పంపిణీ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రతిరోజూ 39 వేల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం చేకూరనుంది. వీరిలో 15,900 మంది గర్భిణులు, బాలింతలు, 23,636 మంది చిన్నారులు ఉన్నారు.అయితే సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందుబాటులోకి రానుండడంతో ప్రభుత్వ ఖజానాపై ఆదనపు భారం పడుతుంది. అయినప్పటికీ మాతా, శిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ప్రణాళికతో లబ్ధిదారులకు మంచి పోషకపదార్థాలను అందించాలనే ఉద్దేశంతో మెనూను రూపొందించింది. రెగ్యులర్గా అందించే ఆహారంతోపాటు రోజుకోరకమైన ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రభుత్వ టీచర్, సర్పంచ్/ వార్డు కౌన్సిలర్, ఆవాస ప్రాంత పెద్దలు, పిల్లల తల్లిదండ్రులతో కూడిన కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.
‘ఆరోగ్య లక్ష్మి’కి ఖర్చు ఇలా..
అంగన్వాడీల్లో ఆరోగ్యలక్ష్మి పథకం నిర్వహణకు ప్రభుత్వం నిత్యం లక్షలాది రూపాయలను వెచ్చిస్తోంది. మాతా, శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 2022లో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో గర్భిణికి, బాలింతకు ప్రతి రోజూ రూ.21 వెచ్చిస్తోంది. 150 గ్రాముల బియ్యానికి రూ.6, 30 గ్రాముల పప్పుకు రూ.2.55, 16 గ్రాముల నూనెకు రూ.1.10, 200 గ్రాముల పాలకు రూ.9.85, కోడిగుడ్డుకు రూ4.20, 50 గ్రాముల కూరగాయలకు రూ.1.5, ఇతర ఖర్చులకు మరో రూ.6 చొప్పున వెచ్చిస్తోంది. 3 నుంచి 6 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసమైతే రోజుకు రూ.7.26 చొప్పున, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారుల కోసమైతే రోజుకు రూ.7.12 చొప్పున వెచ్చిస్తోంది.