సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళలు, యువతులు తెల్లవారుజామునే వాకిళ్లలో పేడ నీళ్లు చల్లి ఆకట్టుకునే విధంగా ముగ్గులు వేసి రంగురంగులతో తీర్చిదిద్దారు. ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిపై నవధాన్యాలు పోసి పూజలు చేశారు. గుమ్మాలకు బంతిపూలు, మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. ఇంటింటికీ తిరుగుతూ హరిదాసులు కీర్తనలు పాడుతూ.. డూడూ బసవన్నలు చేస్తున్న విన్యాసాలు పండుగ శోభను తెచ్చిపెట్టాయి. ఉదయమే కుటుంబ సమేతంగా నూతన వస్ర్తాలు ధరించి ఆలయాలు, ఇళ్లల్లో పూజలు చేసి.. తర్వాత మహిళలు పిండి వంటల్లో నిమగ్నమయ్యారు.
యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ భవనాలపైకి ఎక్కి రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ పొద్దంతా సందడి చేశారు. కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో ఇంటింటా పండుగ సందడి నెలకొన్నది. నోరూరించే రుచికరమైన పిండివంటలు ఆరగించారు. మహిళలు సాయంత్రం పేరంటాలు నిర్వహించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కనుమ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రైతులు ప్రాధాన్యతగా భావించే పండుగ రోజు పశుపక్ష్యాదులకు పూజలు చేశారు. పాడిపంటలు, సిరిసంపదలు తెచ్చిపెట్టే పశువులకు ఈరోజు ఎలాంటి పని చెప్పకుండా భక్తిప్రపత్తులతో పూజించారు. ఉమ్మడి జిల్లాలోని గోశాలల్లో పశువులను అలంకరించి.. పసుపు, కుంకుమలతో గోపూజ చేశారు. ధనర్మాసోత్సవాల్లో భాగంగా పలు ఆలయాల్లో గోదారంగనాథుల స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. – ఖమ్మం, జనవరి 16 , నమస్తే నెట్వర్క్