పెనుబల్లి, జూలై 18 : కాంగ్రెస్ పాలనలో మహిళలకు కనీస భద్రత, రక్షణ కరువైందని, రాష్ట్రంలో రోజుకోచోట అఘాయిత్యం జరుగుతున్నా హోం మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో దుక్కులు దున్నిన రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసిందల్లా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం, మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప చేసేదేమీలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరిగిన చిన్న పొరపాటు వల్ల రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగిస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే.. 10 శాతం పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుందన్నారు. రక్తం చల్లితేనే పంటలు పండుతాయంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రక్తం ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధమేనన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ వెల్లడిస్తున్నాయని, దీనిని ఓర్వలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఓటు హక్కు ఎంతో విలువైందని, సర్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకట్రావు, చెక్కిలాల మోహన్రావు, కూసంపూడి మహేష్, లక్కినేని వినీల్, కోటగిరి సుధాకర్బాబు, మందడపు అశోక్కుమార్, చెక్కిలాల లక్ష్మణరావు, చెలికాని నీలాద్రిబాబు, కొప్పుల గోవిందరావు, చింతనిప్పు సత్యనారాయణ, సర్పంచ్లు బానోతు పాపా, నారపోగు శారద, శిరీష, సత్యావతి, కొంగల రాంబాబు, లగడపాటి శ్రీనివాసరావు, కొత్తగుండ్ల అప్పారావు, కోట ప్రభాకర్, ఇమ్మడి వెంకటేశ్వరరావు, తేజావత్ తావునాయక్, ఎస్కే గౌస్, మరకాల చంటి, వెంకీ, గాయం రాజు తదితరులు పాల్గొన్నారు.