ఖమ్మం: రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభివృద్ధి అందరికీ తెలుసన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సత్తుపల్లి ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలోనే అభివృద్ధిలో సత్తుపల్లి అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.
అగ్రవర్ణాల లోని పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల కళ్ల ముందే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. ఎక్కువ మెజారిటీ వచ్చేలా మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని కోరారు. తాను ఎవరిపై తప్పుడు కేసులు పెట్టలేదని, ప్రజలను వేధించలేదని వెల్లడించారు. ప్రజలతో ఉండే పని చేశానని, మరో సారి ఓటు వేసి గెలిపించాలన్నారు.