కొత్తగూడెం కల్చరల్, ఫిబ్రవరి 5 : అమ్మా.. తల్లి.. అని వేడుకోగానే కోర్కెలు తీరుస్తున్న వన దేవతలకు భక్తులు తమ ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్లకొకసారి వచ్చే సమ్మక్క – సారలమ్మ జాతర ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. జిల్లా కేంద్రంలోని భక్తులంతా తమ ఎత్తు బంగారాన్ని కొనుగోలు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే వారితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద పూజలు చేసేందుకు తమ ఎత్తు బంగారాన్ని తీసుకుంటున్నారు. అచ్చం మేడారంలో జరిగిన మాదిరిగానే స్థానికంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో జాతరలు జరగనున్నాయి. తమను నిండూనూరేళ్లు చల్లగా కాపాడాలని వేడుకుంటూ మొక్కులు చెల్లించేందుకు భక్తులు తల్లుల చెంతకు చేరుతున్నారు.
మేడారం జాతరకు నెలరోజుల ముందు నుంచే భక్తుల తాకిడి మొదలైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు జిల్లావాసులు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక వాహనాలు, బైక్లు, టాటామ్యాజిక్ ఆటోలు, బొలెరో, డీసీఎం, కార్లు ఇలా ప్రత్యేక వాహనాల్లో కుటుంబ సమేతంగా కలిసి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో అందరూ ఒకచోట చేరి సహపంక్తి భోజనాలు చేసుకొని మళ్లీ సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నారు.
వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తుంటారు. బంగారం అంటే బెల్లం. అలా తమ ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తే చాలు మొక్కులు తీరిపోయినట్లే. కుటుంబంలో ఎంతమంది మొక్కుకుంటే అంతమంది తమ ఎత్తు అనగా తమ బరువుకు తగినంతగా బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇలా బంగారం కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడడంతో బెల్లం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కొత్తగూడెం పెద్దబజార్ వ్యాపారులు ప్రత్యేకంగా కౌంటర్లను ప్రారంభించడంతో భక్తులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెద్దబజార్ రద్దీగా మారింది. బంగారం కొనుగోలు చేసే సమయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాల్సి ఉంటుంది. బంగారం విక్రయాలతోపాటు నారికేళానికి డిమాండ్ పెరిగింది.
మేడారంలో వనదేవతల జాతర ఏ విధంగా జరుగుతుందో అచ్చం అదేవిధంగా స్థానికంగా సమ్మక్క – సారలమ్మ జాతరలు జరగనున్నాయి. ఈ నెల 16, 17, 18 తేదీల్లో అమ్మవార్ల జాతర జరగనుండడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సమీపంలోని లక్ష్మీదేవిపల్లి, లోతువాగు, సుజాతనగర్ మండలంలోని గరీబ్పేట, 2 ఇైంక్లెన్, చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్లో ఉన్న అమ్మవార్ల గద్దెల వద్ద కమిటీ సభ్యులు, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెలకు రంగులు వేయించి పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో గద్దెల వద్ద నిద్ర చేసే భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి వసతి, లైటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.