నమస్తే నెట్వర్క్ ; దశాబ్దాల పోరాటానికి ‘పట్టా’తో ఫలితం దక్కింది. యజమానిగా హక్కు పత్రం చేతికొచ్చింది. పోడు గిరిజనులందరూ రైతులందరి మాదిరిగానే ఇంతకాలం నమ్ముకున్న భూమిలోనే సాగు చేసుకోవచ్చు. ఇష్టమైన పంటలు పండించుకొని లాభాలు గడించొచ్చు. కుటుంబాలను పోషించుకుంటూ ఇంటిల్లిపాదీ సుఖ సంతోషాలతో జీవించొచ్చు. ఇతర రైతుల మాదిరిగానే పంట పెట్టుబడికి సాయం అందుతుంది. రుణాలు దొరుకుతాయి. రైతుబీమా వర్తిస్తుంది. ఇదంతా సీఎం కేసీఆర్ చల్లని చూపు, చలవ, దయతోనే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పోడు బిడ్డలు వేనోళ్ల పొగుడుతున్నారు. మారుమూలన ఉన్న గిరిజన బిడ్డలను మరిచిపోకుండా పట్టాలిచ్చిన సారు మేలు మరవలేమంటున్నారు. ఎన్ని జన్మలెత్తినా సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడించి మొక్కుతున్నారు గిరిజన బిడ్డలు.
పోడు వ్యవసాయమే వారికి ఆధారం. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. అయినా ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులు లేవు. పంట వేసిన ప్రతిసారి ఫారెస్టు అధికారులు, పోలీసోళ్లు వచ్చి రచ్చరచ్చ చేసేవారు. గొడవలెన్నో జరిగాయి. కేసులెన్నో పెట్టారు. ఈక్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతోమంది నాయకులకు చెప్పుకున్నరు. ఒక్కరూ కూడా తమ బాధలు పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో ఇక బతికుండగా తమకు పట్టాలు రావనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ దేవుడు సీఎం కేసీఆర్ సార్ అని కొనియాడుతున్నారు. –
పట్టాతో జన్మ ధన్యమైంది
పోడు భూమికి సీఎం కేసీఆర్ హయాంలో పట్టా రావడంతో నా జన్మ ధన్యమైంది. 15 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న నాకు పట్టా లేకపోవడంతో అటవీ అధికారులతో గోస ఉండేది. పట్టాలు ఇవ్వడంతోపాటు పోడు రైతులపై పెట్టిన కేసులు కూడా కేసీఆర్ తొలగించడంతో పోడు రైతుగా నిజమైన రైతులతో కలిసి వ్యవసాయం చేసే అదృష్టం కలిగింది. త్వరలో రైతుబంధు ఇస్తామని ప్రకటించడం ఆనందాన్ని కలిగించింది.
-పాయం సీతమ్మ, పోడు రైతు, దబ్బనూతల కొత్తూరు, దుమ్ముగూడెం మండలం
పోడు రైతుల కల నెరవేరింది
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పోడు రైతుల బాధలను గుర్తెరిగి పట్టాలు ఇస్తామన్న హామీని నెరవేర్చారు. గిరిజనులు పోడు చేస్తున్న క్రమంలో అటు అటవీ అధికారు లు.. ఇటు అధికారుల నిర్బంధాలతో ఎన్నో అగచాట్లు పడ్డాం. ఎట్టకేలకు కేసీఆర్ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంతోపాటు కేసులు ఎత్తివేయడంతో పోడు రైతులందరికీ విముక్తి లభించింది. త్వరలో రైతుబంధు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ సార్ చెప్పడం ఆనందాన్నిచ్చింది. పోడు రైతులు కేసీఆర్ను ఎన్నటికీ మరువరు.
–సోడి కొండయ్య, పోడు రైతు, సర్పంచ్, సింగవరం, దుమ్ముగూడెం మండలం
పట్టా దక్కడం ఆనందాన్నిచ్చింది
పోడు రైతులకు పట్టాలు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చింది. తనకున్న 2.25 ఎకరాల్లో 25 ఏళ్లుగా పోడు కొట్టుకుని సాగు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించా. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించి పోడు భూమికి పట్టా ఇచ్చి ఆదుకున్నారు. అటవీ అధికారులు పోడు రైతులపై పెట్టిన కేసులు తొలగించడం మంచి పరిణామం. రైతుబంధు కూడా వస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది.
-కొర్సా శ్రీను, పోడు రైతు, జమేదారుబంజరు, దమ్మపేట మండలం
భయపడకుండా సాగు చేస్తాం..
తాత, ముత్తాతల కాలం నుంచి పోడు భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా భూములకు పట్టాలు లేకపోవడంతో అటవీ అధికారులు తరచూ బెదిరించేవారు. గత ప్రభుత్వాలకు మా గోస చెప్పుకుంటే ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అర్హత కలిగిన పోడు సాగుదారులందరికీ పట్టాలిచ్చి ఆదుకుంటామని చెప్పి మాట నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏకంగా పట్టాలు ఇచ్చి మా చిరకాల కోరికను తీర్చారు. సీఎం కేసీఆర్కు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
–అజ్మీర స్వరూప, చీమలపాడు, సింగరేణి మండలం
పట్టాతో యజమాని అయ్యా..
తెలంగాణ ప్రభుత్వంలో పోడు చేసుకుంటున్న తమకు పట్టాలు అందించడంతో పోడు భూమి కి నేను యజమాని అయ్యాను. నాకున్న 2.13 ఎకరాల్లో భూమిని పోడు చేసుకుని సాగు చేసు కున్నా. ఇదివరకు ఫారెస్టు అధికారులతో ఎంతో గోసపడ్డాం. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీ ఆర్ పోడు రైతుల బాధలను గుర్తించి ఆ భూ ములకు పట్టాలు ఇవ్వడం దేశానికే గర్వకా రణం. రైతుబంధుతోపాటు పోడు కేసులు కొట్టి వేయాలని ఆదేశించడం ఆనందాన్నిచ్చింది. కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
–సున్నం నాగరత్నం, పోడు రైతు, జమేదారుబంజరు, దమ్మపేట మండలం
కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు
ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న మా భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం రావడం సంతోషంగా ఉంది. పోడు చేసుకునే భూములకు పట్టాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్ దేవుడిలా కరుణించి పట్టాలు అందించారు. ఇదే మాకు ఆధారం. ఇన్నేండ్ల తర్వాత ఇప్పటికి పట్టా పాస్పుస్తకం రూపంలో ఫలితం దక్కింది. ఇప్పుడు అన్ని ఇబ్బందులు పోయాయి. మాకు భూమిపై సీఎం కేసీఆర్ సార్ హక్కులు కల్పించారు. సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–బూరుగు రమాదేవి, అబ్బుగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సార్..
నేను మూడెకరాలు పోడు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అసలు పోడు భూములకు పట్టాలు వస్తాయనే ఆశలు కూడా వదులుకున్నా. సీఎం సార్ చెప్పినట్లుగా మా భూములకు పట్టాలు ఇచ్చారు. పోడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో చాలా మందికి పోడు పట్టాలు వచ్చాయి. ప్రతి కుటుంబంలో పండుగ చేసుకుంటున్నారు. పోడు భూమికి పట్టాలిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. -కంగాల వెంకటేశ్, గిరిజన రైతు, పైడిగూడెం, దుమ్ముగడెం మండలం