రాష్ట్రంలోని ప్రతిఒక్కరి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. అందులో భాగంగానే ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీటిని అందిస్తోంది.. విద్యార్థులు కలుషిత, ఫ్లోరైడ్ నీరు తాగి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మిషన్ భగీరథ నీటిని ప్రతి పాఠశాలకూ అందిస్తోంది.. ఇక నుంచి తెలంగాణలోని పాఠశాలలు, అంగన్వాడీలు, ఆలయాలు, చర్చిలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ ఇదే నీటిని సరఫరా చేయనున్నది. అందుకోసం ఉచితంగా నల్లా కనెక్షన్లు అందిస్తోంది. దీంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-ఖమ్మం, జనవరి 21
ఖమ్మం, జనవరి 21: మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ నల్లాల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి తెలంగాణలోని పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ ఇదే నీటిని సరఫరా చేయనుంది. ఇప్పటికే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఖమ్మం జిల్లాలోని 584 పంచాయతీలు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. వీటితోపాటు జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఉచితంగా మంచినీటిని అందిస్తోంది. అదే విధంగా పంచాయతీ కార్యాలయాలు, చర్చీలు, మసీదులు, దేవాలయాలకు కూడా ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇస్తోంది. ఈ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. నల్లా ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ విభాగాలకూ మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం కనెక్షన్లు కూడా ఇస్తోంది.
1,864 అంగన్వాడీలకు..
ఖమ్మం జిల్లాలోని 1,837 అంగన్వాడీ కేంద్రాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నారు. వీటిలో ప్రభుత్వ భవనంలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రానికీ మంచినీటిని అందించేందుకు నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 1,400 అంగన్వాడీలకు కనెక్షన్ ఇచ్చారు.
ప్రార్థనా మందిరాలకు..
జిల్లాలోని అన్ని ఆలయాలు, చర్చీలు, మసీదులకు కూడా మిషన్ భగీరథ మంచినీరే అందుతోంది. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపులో లేని, ఉన్న దేవాలయాలు సుమారు 386 ఉన్నాయి. వీటన్నింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. వీటితోపాటు సుమారు 2 వేల వరకు చర్చీలు ఉన్నాయి. వీటిలో కూడా అత్యధిక చర్చీలకు భగీరథ నల్లా కలెక్షన్లు ఇచ్చారు. వీటితోపాటు జిల్లాలో ఉన్న 287 మసీదులకు కూడా నల్లాలను బిగించారు. ఇవే కాకుండా ఇతర ఆలయాలకు కూడా అధికారులు నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
1,311 ప్రభుత్వ పాఠశాలలకు..
విద్యార్థులు కలుషిత, ఫ్లోరైడ్ నీరు తాగి వ్యాధుల భారిన పడకుండా ఉండేందుకు మిషన్ భగీరథ నీటిని ప్రతి పాఠశాలకూ అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 1,004 ప్రాథమిక పాఠశాలలు, 211 ఉన్నత పాఠశాలలు, 56 గురుకులాలు, ఒక కేంద్రీయ విద్యాలయం, మోడల్ స్కూళ్లు, నవోదయ స్కూల్, 14 కేజీబీవీ పాఠశాలలు, 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఒక పీజీ కళాశాల ఉన్నాయి. మొత్తం 1,311 ప్రభుత్వ విద్యాసంస్థలకు నల్లా కనెక్షన్ ఇచ్చారు. గతంలో పాఠశాలల విద్యార్థులకు మంచినీరు అందాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా పాఠశాలలకే నల్లా కనెక్షన్తో సురక్షిత నీటిని సరఫరా చేస్తుండడంతో విద్యార్థులకు తాగునీటి సమస్య తొలగిపోయినట్లయింది.
ఆసుపత్రులు, పంచాయతీలకూ కనెక్షన్లు..
జిల్లాలోని 584 గ్రామ పంచాయతీలుండగా అన్ని పంచాయతీ కార్యాలయాలకూ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లు, గ్రంథాలయాలకు కూడా నల్లా కనెక్షన్లు బిగించారు. వీటితోపాటు జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకూ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి.
ప్రతి ప్రభుత్వ భవనానికి నల్లా కనెక్షన్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలకూ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇస్తున్నాం. దాదాపు అన్ని రకాల భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు అన్ని భవనాలు, కార్యాలయాలకూ నల్లా కనెక్షన్లు ఇచ్చాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తోంది.
-పుష్పలత, ఎస్ఈ, మిషన్ భగీరథ, ఖమ్మం