‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. పథకం అప్రతిహతంగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నది. ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతున్నది. భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు 242 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా నామినీల ఖాతాల్లో రూ.12.10 కోట్ల పరిహారం జమ అయ్యింది. ప్రస్తుతం ఈ ఏడాది జూన్ 18 లోపు పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి వ్యవసాయశాఖ బీమా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రైతులు వచ్చే నెల 5 లోపు ఏఈవోలకు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఇదే నెల 15 నుంచి కొత్తవారికి పథకం వర్తిస్తుందని ప్రకటించింది.
– అశ్వారావుపేట, జూలై 16
అశ్వారావుపేట, జూలై 16: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్ అదునులో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతుబంధులో భాగంగా ఏడాదిలో ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2018 ఆగస్టు 15 నుంచి ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ మేరకు ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)’కు ప్రీమియం చెల్లిస్తున్నది. రైతు ఏ కారణంతో మృతిచెందినా సరే మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,40,410 మంది రైతులు ఉండగా వీరిలో 18-59 ఏళ్లలోపు ఉన్నవారు 80,690 మంది. వీరందరికీ ప్రస్తుతం బీమా వర్తిస్తున్నది. కొత్తగా పట్టా తీసుకున్న రైతులు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ అవకాశం కల్పించింది.
242 కుటుంబాలకు పరిహారం..
పథకం ఐదేళ్ల నుంచి అమలవుతున్నది. ప్రస్తుతం ఆగస్టు 16 నుంచి ఆరో సంవత్సరంలో అడుగు పెట్టనున్నది. గతేడాది అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 1,40,410 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. వీరిలో 18 -59 ఏళ్లలోపు రైతులు 80,690 మంది ఉన్నారు. వీరందరికీ ‘రైతుబీమా’ పథకం వర్తించింది. ఇప్పటివరకు 242 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.12.10 కోట్ల పరిహారం అందింది. ప్రస్తుతం 2023 జూన్ 18 లోపు పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి ఏఈవోలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులకు వచ్చే నెల 5 వరకు గడువు ఉంది. కొత్త రైతులకు ఇదే నెల 15 నుంచి పథకం వర్తిస్తుంది. బీమా విషయంలో నామినీ పేర్లను మార్చుకునే అవకాశాన్నీ ప్రభుత్వం కల్పిస్తున్నది.
బీమా వర్తింపు ఇలా..
సాధారణంగా బీమా ప్రీమియాన్ని చెల్లిస్తున్నప్పుడు ఎంతోకొంత రిటర్నులు (తిరిగి పొందడం) ఆశిస్తుంటారు పాలసీదారులు. ఇప్పటి వరకూ చాలామంది చెల్లిస్తున్న బీమా పాలసీల్లో సేవింగ్స్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు, చిన్నారుల భవిత కోసం పొదుపు చేసే పాలసీలు, యూలిప్ పాలసీలే అధికం. ఇవి ఎక్కువ మొత్తానికి జీవిత బీమా (మనిషి విలువ అత్యల్ప మొత్తానికి)ను కల్పించినా ఈ పాలసీలన్నింటికీ మెచ్యూరిటీ టైం ఉంటుంది. ఆ టైంలో ఎంతోకొంత రాబడి వస్తుంది. కానీ టర్మ్ పాలసీలు భిన్నమైనవి. వీటికి మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ గడువులోగా రిస్క్ జరిగితేనే పరిహారం అందుతుంది. లేదంటే ప్రీమియం చెల్లింపులు వృథానే. ఒక్క పైసా వెనక్కు రాదు. అందుకే ఇవి చాలా తక్కువ ప్రీమియానికి అత్యధిక సం అష్యూర్డ్ను అందిస్తాయి. రైతుబీమా కూడా సరిగ్గా ఇదే. రిస్క్ జరిగితే వెంటనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.
సామూహిక బీమా..
తక్కువ వయసులో ఉన్నప్పుడు, వ్యాధులు అంతగా లేనప్పుడు తీసుకునే బీమా పాలసీలకు (రిస్క్ తొందరగా ఉండదు కాబట్టి) ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ బీమా సంస్థలు ప్రీమియాన్ని పెంచుతూ ఉంటాయి. కానీ ‘రైతుబీమా’ సామూహిక బీమా కాబట్టి సాధారణ నిబంధనలు వర్తించడం లేదు. సామూహిక బీమా కాబట్టే అందరికీ ఒకటే ప్రీమియం. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వ్యక్తికీ హెల్త్ బీమా ఉంటుంది. నిజానికి బీమా వినియోగంలో మన దేశం ఇంకా వెనుకబాటులోనే ఉందనడంలో సందేహం లేదు. 1991-92లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినందున ఎన్నో బహుళజాతి సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టాయి. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. మల్హోత్రా కమిటీ సిఫార్సుల మేరకు 1999లో ఐఆర్డీఏఐ ఏర్పడింది. తరువాత 2000లో సంస్థకు స్వయం ప్రతిపత్తి వచ్చి రాజ్యాంగ సంస్థగా ఏర్పడింది. అప్పటి నుంచి బీమా రంగం ప్రాచుర్యంలోకి వచ్చింది. గతంలో బీమాకు పట్టణ ప్రాంతాల్లోనే ప్రాధాన్యం ఉండేది. సీఎం కేసీఆర్ మాత్రం రైతుల కోసం పట్టణాల నుంచి మారుమూల గిరిజన గూడేలకు చెందిన రైతులకూ బీమా వర్తింపజేస్తున్నారు.
ఏ కారణంతో మృతిచెందినా..
వాస్తవానికి సాధారణ పౌరుడు బీమా పాలసీ తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.5 లక్షల బీమా తీసుకోవాలంటే ముందుగా వైద్య పరీక్షలు తప్పనిసరి. వయస్సు పెరిగిన కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. బీమా తీసుకోవడానికి ముందే ఆ వ్యక్తికి వ్యాధులు ఉంటే ప్రీమియం మరింత ఎక్కువవుతుంది. కొన్ని వ్యాధులకైతే వెయిటింగ్ పీరియడ్ (వేచి ఉండే సమయం) ఉంటుంది. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీలు అసలు బీమానే ఇవ్వవు. ఇక ఆత్మహత్యలు, ఉద్దేశపూర్యకంగా ఘర్షణల్లో పాల్గొని మృతిచెందిన వారికి, హత్యగురైన వారికి బీమా అందే అవకాశమే లేదు. ఏ క్షణంలోనైనా మృతిచెందే అవకాశం ఉన్న పోలీసులు, జవాన్లు, రాజకీయ నాయకులకూ బీమా సంస్థలు బీమా ఇచ్చేవి కావు. కానీ తెలంగాణ ప్రభుత్వం బీమా సంస్థతో చర్చలు జరిపి రైతు కారణంతో మృతిచెందినా మృతుడి కటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం ఇవ్వాలని ఒప్పందం చేసుకుని పథకాన్ని అమలు చేస్తున్నది.
కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవాలి..
రైతు కుటుంబాల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేసున్న్తది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న రైతులతో పాటు కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులకూ ప్రభుత్వం బీమా వర్తింపజేస్తున్నది. ఆగస్టు 5 లోపు కొత్తగా పట్టా పుస్తకాలు పొందిన రైతులు ఏఈవోలకు దరఖాస్తులు అందజేయాలి. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది.
– ఎస్కే అఫ్జల్ బేగం, వ్యవసాయశాఖ సహాయ సంచాలకురాలు, అశ్వారావుపేట