కొత్తగూడెం అర్బన్/ అశ్వారావుపేట టౌన్, జనవరి 17: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారంతా సెలవులు ముగియడంతో నగరాలు, పట్టణాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరుస్తున్నాయి. బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. కొత్తగూడెం బస్టాండ్లో బుధవారం ఇవే దృశ్యాలు కన్పించాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లిన వారంతా సంక్రాంతి సెలవుల కోసం వారం రోజుల క్రితమే సొంతూళ్లకు చేరుకున్నారు.
ఇన్ని రోజులూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఇప్పుడు సెలవులు ముగియడంతో తిరిగి పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో బస్సులు కిక్కిరిస్తున్నాయి. కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలంతా కొత్తగూడెం బస్టాండు నుంచి ప్రయాణించాల్సి ఉండడంతో వారంతా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో కొత్తగూడెం బస్టాండ్ ప్లాట్ఫారాలు, పరిసర ప్రాంతాలు బుధవారం కిటకిటలాడాయి.