సత్తుపల్లి, జూన్ 25: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీడీఎఫ్ నిధుల నుంచి రూ.50కోట్ల నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో చేపట్టే పనులకు వచ్చే నెల మొదటి వారంలో వివిధ శాఖల మంత్రులచే శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 818 పనులకు గాను రూ.50కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సత్తుపల్లి మండలానికి రూ.9.80కోట్లు, పెనుబల్లి మండలానికి రూ.10.86కోట్లు, వేంసూరు మండలానికి రూ.7.73కోట్లు, కల్లూరు మండలానికి రూ.12.77కోట్లు, తల్లాడ మండలానికి రూ.5.85కోట్లు, సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.1.85కోట్లు మంజూరు చేశామన్నారు. వీటితో పాటు నీలాద్రి ఆలయ అభివృద్ధికి రూ.50లక్షలు, తాళ్లమడలోని దేవాలయ నిర్మాణానికి రూ.35లక్షలు నిధులు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో ఓ నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని, త్వరలో వాటికి కూడా ప్రతిపాదనలు పంపి మంజూరు చేయిస్తామన్నారు.
నియోజకవర్గంలో రూ.2కోట్లతో సత్తుపల్లిలో షాదీఖానా నిర్మాణం, కల్లూరులో రూ.75లక్షలు, పెనుబల్లిలో రూ.75లక్షలు, వేంసూరులో రూ.75లక్షలతో నిర్మించతలపెట్టిన షాదీఖానాలకు వచ్చే నెల మొదటివారంలో హోంశాఖామంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సత్తుపల్లిలో రూ.కోటితో నిర్మించతలపెట్టిన ముస్లిం సోదరుల కమ్యూనిటీ హాల్, రూ.2.50కోట్లతో అంబేద్కర్ ఆడిటోరియం, వివిధ అభివృద్ధి పనులకు ఐటీ, పురపాలకశాఖామంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆర్అండ్బీశాఖలో ఆర్అండ్బీ శాఖామంత్రి ప్రశాంత్రెడ్డి, రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో శంకుస్థాపనలు చేయించనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను వచ్చేనెలలో కలెక్టర్ ద్వారా ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో దళితబంధు రెండో విడత 1,100 యూనిట్లు మంజూరయ్యారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చదువుకున్న యువతకు ఈ పథకంలో ప్రాధాన్యత కల్పిస్తామన్నా రు. అదేవిధంగా సింగరేణి బ్లాస్టింగ్ వల్ల సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో నష్టపోయిన గృహ యజమానులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ పర్యటించి వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మ న్ కూసంపూడి మహేశ్, ఎంపీపీలు దొడ్డా హైమావతి, లక్కినేని అలేఖ్య, ఆత్మచైర్మన్ వనమా వాసు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సీడీసీ చైర్మన్ ముక్కెర గోపాలరెడ్డి పాల్గొన్నారు.