పేదింటికి గృహలక్ష్మి నడిచి వచ్చింది.. గూడు లేక గోస పడుతున్న బతుకులకు భరోసా లభించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు లేదా ఇల్లు ఉండీ కూలిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుపేదలను ఆదుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రాంట్ను మహిళల పేరుపైనే మంజూరు చేస్తామని క్యాబినెట్ ప్రకటించింది. అందుకే ఈ పథకానికి ‘గృహలక్ష్మి’ అని నామకరణం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కో విడతకు రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో రూ.3 లక్షలు జమ చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని ఎంపిక చేయనున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల పరిధిలో 30 వేల మందికి గృహలక్ష్మి పథకం వర్తించనున్నది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది.
– ఖమ్మం, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఏళ్ల తరబడి పూరి గుడిసే వారికి ఆవాసం.. కూలి చేసుకుంటేనే పూట గడిచే జీవితాలు.. తరాలు మారుతున్నా తప్పని పేదరికం.. చంటి బిడ్డలు, వృద్ధులతో కలిసి ఆ ఇంట్లోనే నివాసం.. ఇంకా కొన్నిచోట్ల ఇల్లు ఉంటుంది.. కానీ అది ప్రకృతి వైపరీత్యాలకు శిథిలమవుతుంది.. పిచ్చిమొక్కలు మొలిచి, గోడలు పెచ్చులు రాలుతూ ఆస్తిపంజరాన్ని తలపిస్తుంది.. అలాంటి అభాగ్యజీవులు, బడుగు జీవుల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.. ప్రతిష్ఠాత్మకంగా ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేయనున్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు లేదా ఇల్లు ఉండీ కూలిపోయి పరాయి పంచన బతుకుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అశ్వాపురం, మార్చి 10: పేదలకు గూడు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ అన్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల గ్రాంట్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అమరేందర్ మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల మంది లబ్ధి పొందనున్నారన్నారు. త్వరలో పోడుదారులకు పట్టాలిస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, నాయకులు వెన్న అశోక్కుమార్, ఏనిక రవిబాబు, కాకా అశోక్, గద్దల రామకృష్ణ, గొర్రెముచ్చు వెంకటరమణ, షేక్ నయీం, డాక్టర్ బాబు, గాదె వెంకటేశ్వర్లు, పిట్టా శ్రీను, తూము చిన వీరరాఘవులు, జూపల్లి కిరణ్, కరకపల్లి డేవిడ్, చుంచు రామ్మూర్తి, మేకల భాస్కర్, శ్యాంసన్ పాల్గొన్నారు.
గృహలక్ష్మి పథకం మాలాంటి నిరుపేదలకు వరం. మాకు సొంతిల్లు లేదు. 20 ఏళ్ల నుంచి అద్దె ఇంట్లోనే ఉంటు న్నాం. ఆర్థిక భారా న్ని మోస్తున్నాం. రోజువారీ కూలి చేసుకొని బతకుతూ ఇద్దరు ఆడపిల్లలను చదివించుకున్నాం. కష్టపడి ఒక అమ్మాయికి పెళ్లి చేశాం. మరో అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. మాతో కలిసి కూలి పనులకు వస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో సొంతింటి కోసం ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. అద్దె ఇంట్లోనే కాలం వెల్లబుచ్చుతున్నాం. మాకు కొంత సొంత జాగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం. సొంతింటి కల నెరవేర్చుకుంటాం.
– కేతేపల్లి ప్రమీల, గోవిందాపురం(ఎల్), బోనకల్లు మండలం
మేం 15 ఏండ్ల నుంచి పూరి గుడిసెలో నివసిస్తున్నాం. చిన్న ఇంటిలో ముగ్గురు పిల్లలతో కలిసి ఉండడం కష్టంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. వాన కాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. మబ్బు పడితే చాలు మాలో వణుకు మొదలవుతుంది. కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. పిల్లలను పోషించుకుంటున్నాం. ఇక ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఎలా వస్తుంది మాకు. సొంత జాగా ఉన్న వాళ్లకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం మాలో ఆశలు నింపింది. గ్రాంట్ విడుదలైతే మా జీవితానికి అంతే చాలు.
– పల్లపు సుగుణ, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
నాకు పెళ్లయి నాలుగేళ్లయింది. కానీ మాకు ఉండటానికి ఇల్లు లేదు. ఉన్న చిన్నపాటి స్థలంలోనే తాటాకులతో పూరిల్లు కట్టుకున్నం. చిన్న ఇం ట్లోనే ఒక వైపు అత్త, మరోవైపు మేమూ ఉంటున్నం. సీఎం కేసీఆర్ సార్ స్థలమున్నోళ్లకు డబ్బులు ఇస్తానని చెప్పి మాలో భరోసా ఇచ్చిండు. గ్రాంట్ విడుదలైతే మా గూడు కష్టాలు తీరుతాయి. వచ్చిన సొమ్ముతో పక్కా ఇల్లు కట్టుకుంటం. గృహలక్ష్మి పథకం మాలాంటి పేదోళ్లకు వరం.
– పామర్తి రాములమ్మ, అశ్వారావుపేట
మాకు స్థలం ఉంది. ఎన్నో ఏళ్లు తాటాకు ఇంట్లోనే బతికాం. గత పాలకులెవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. గత్యంతరం లేక ఉన్న స్థలంలోనే పైన రేకులు వేసి గోడల్లా పరదాలు కట్టుకుని ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం. నేను వృద్ధురాలిని. ఒక్క దానినే ఇంట్లో ఉంటున్నా. పిల్లలు నాతో కలిసి ఉండలేకపోయారు. ఏమీ చేయలేని పరిస్థితిలో వ్యయప్రయాసలకోర్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. గృహలక్ష్మి సొమ్ము వస్తే ఇల్లు కట్టుకుంటా. ఇల్లు వస్తే పిల్లలు మళ్లీ ఇంటికొస్తారు.
– సవరపు మాణిక్యం, వృద్ధురాలు, అశ్వారావుపేట
భార్యాభర్తలిద్దరం కూలీలమే. ఉన్న కాస్త స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే 15 ఏండ్ల నుంచి ఉంటున్నాం. కూలికెళ్తేగానీ పూట గడవని బతుకులు మావి. స్తోమత లేక గత ప్రభుత్వాల హయాంలో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఎవరూ కనికరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తున్నదని తెలుసుకుని సంతోషపడ్డా. అధికారులు మాలాంటి పేదోళ్లను గుర్తించి సొమ్ము ఇప్పిస్తే ఇల్లు కట్టుకుంటాం.
– మామిడి సరోజిని, కూలీ, నేలకొండపల్లి
30 ఏండ్ల నుంచి మేం అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. నా భర్త లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మా పిల్లలు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. చాలీచాలని సంపాదన మేము ఉండేది పేరుకు చిన్న ఊరు. ఇక్కడ తక్కువలో తక్కువ ఇంటి అద్దె రూ.3 వేలు. కరెంట్ బిల్లులు, ఇతర బిల్లులు అదనం. ఇన్ని కష్టాలు పడి చిన్న జాగా కొనుక్కున్నాం. మాలాంటోళ్ల కోసమే సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల సొమ్ము వస్తే ఇల్లు కట్టుకుంటాం.
– అనిరెడ్డి జయమ్మ, అశోక్నగర్కాలనీ,లక్ష్మీదేవిపల్లి మండలం