సత్తుపల్లి రూరల్, సెప్టెంబర్ 16 : ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందిస్తాం.. కాలువల తవ్వకం కోసం బుగ్గపాడు, రుద్రాక్షపల్లి రైతులు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే తనపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకం ఉంచి భూములివ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడులో సీతారామప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించినందుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో పట్టాభూమికి రూ.8 లక్షలు, ఆర్వోఎఫ్ఆర్కు రూ.4 లక్షలు ఇచ్చారని, కానీ బుగ్గపాడులో మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి సమస్యను వివరించగా పట్టా, ఆర్వోఎఫ్ఆర్ తేడా లేకుండా ఎకరాకు రూ.10.50 లక్షలు అందించిన మనస్సున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
గ్రామంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు సుమారు రూ.15.50 కోట్లు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగిందన్నారు. బుగ్గపాడు గ్రామ అభివృద్ధికి రూ.6.50 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ముందుకు వస్తున్నారని, వారిమాటలు నమ్మవద్దని గుర్తుచేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ముందుగా ఎమ్మెల్యే సండ్రకు గ్రామస్తులు మేళతాళాలు, పటాకులతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీ తీసి దిమ్మె వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర, రైతులు పాలు, పూలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. సభాస్థలి వద్ద మహిళలు బతుకమ్మలు ఆడుతూ సందడి చేయగా వారితో కలిసి సండ్ర బతుకమ్మలాడారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సర్పంచ్ కారం జయేందర్రావు, సొసైటీ అధ్యక్షుడు తుమ్మూరు శ్రీరామప్రసాద్, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, బొడ్డు శివరామకృష్ణ, సున్నం సుశీల, భిక్షపతి, బాలకృష్ణ, నాగయ్య, హరికృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ వనమా వాసు, రఘు, ఇరిగేషన్ అధికారులు, ఆర్ఐ నరేశ్, బుగ్గపాడు, రుద్రాక్షపల్లి గ్రామస్తులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.