ఖమ్మం, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నియోజకవర్గంలోని రఘునాథపాలెం ప్రధాన రోడ్లకు మహర్దశ పట్టింది. మండలాభివృద్ధే లక్ష్యంగా నిధులు తీసుకొస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. తన నియోజకవర్గంలోని ఏకైక మండలంలో గల పల్లెలన్నింటినీ పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేయడం కోసం పరితపిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న గ్రామాల్లోని ప్రధాన రహదారులన్నింటినీ డబుల్ లేన్లుగా విస్తరించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అంతేకాక డొంక రోడ్లకూ కొత్తందం తీసుకొస్తున్నారు. గత నెలలోనే రూ.13 కోట్లతో ఆరు రోడ్ల బీటీ రోడ్లకు నిధులు మంజూరు తీసుకొచ్చిన మంత్రి పువ్వాడ.. తాజాగా రూ.12 కోట్లతో మరో ఆరు డొంక రోడ్లను బీటీలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవోను తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రధాన రహదారుల విస్తరణతోపాటు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పల్లెలకు నూతన సొబుగులు తెచ్చారు. త్వరలోనే మంజూరైన రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రామస్థులకు రోడ్లను అందుబాటులోకి తేనున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండలంలోని పలు గ్రామాలను అనుసంధానం చేసేందుకు ఉన్న ఆరు రహదారుల బీటీలుగా మార్చేందుకు రూ.12.40 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తూ జీవో జారీ చేసింది. గతంలో సింగిల్ రోడ్ల నిర్మాణానికే దిక్కులేకుండా ఉండే రోడ్లన్నీ.. కేసీఆర్ సర్కార్లో డబుల్ రోడ్లుగా మారుతున్నాయి. దీంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గణేశ్వరం నుంచి దొనబండ వరకు 4 కిమీ రహదారికి రూ.3.30 కోట్లు, రఘునాథపాలెం నుంచి జింకలతండా వరకు 3 కిమీ రహదారికి రూ.2.50 కోట్లు, కేవీ బంజర నుంచి మూలగూడెం వరకు 1.60 కిమీ రహదారికి రూ.1.40 కోట్లు, ఎన్వీ బంజర నుంచి మూలగూడెం వరకు 1.40 కిమీ రహదారికి రూ.1.20 కోట్లు, రఘునాథపాలెం బైపాస్ నర్సింహ చెరువు మీదుగా రఘునాథపాలెం గ్రామం వరకు 1.30 కిమీ రహదారికి రూ.1.15 కోట్లు, కోటపాడు నుంచి పాపటపల్లి వరకు వయా మాచిన చెరువు మీదుగా 4 కిమీ రహదారి నిర్మాణానికి రూ.2.85 కోట్లు మంజూరు చేశారు.