భద్రాద్రి కొత్తగూడెం, మే 6 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం రోడ్(కొత్తగూడెం) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు రాసిన లేఖలో రైల్వే డివిజన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) రైల్వేస్టేషన్ ఏర్పడి వందేళ్లకు చేరువవుతున్న సందర్భంగా దాని చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ, కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ రవిచంద్ర వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం నుంచి కిరండోల్, మల్కాన్గిరి, కొవ్వూరు రైల్వే లైన్లు ఏర్పడితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు అనుసంధానంగా ఉంటుందని ఆయన మంత్రికి వివరించారు. ఈ వినతికి స్పందించిన అశ్విని వైష్ణవ్ ఈ సూచనను రైల్వే ఉన్నతాధికారుల పరిశీలనకు పంపామని, పూర్తికాగానే తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి ఎంపీ రవిచంద్రకు రాసిన ప్రత్యుత్తరంలో బదులిచ్చారు.