కొత్తగూడెం, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, తమ శాఖలపై ఉన్నతాధికారులకు అజమాయిషీ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. మంగళవారం కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కలెక్టర్ ప్రియాంక ఆల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత చండ్రుగొండ జడ్పీటీసీ వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో తల్లీబిడ్డ చనిపోతే కనీసం వైద్యులపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి పీహెచ్సీలో నర్సులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మంజుభార్గవి సభ దృష్టికి తెచ్చారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు రాకపోగా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. పలు అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేయించాలని కోరారు. కాగా.. పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. సమావేశ మందిరం నిండిపోవడంతో కొందరు అధికారులు ఆరుబయటే కూర్చున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అపరిశుభ్రత నెలకొన్నదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎంసీహెచ్లో తల్లీబిడ్డ చనిపోతే పై అధికారులకు కూడా తెలియకపోవడం బాధాకరమన్నారు. ఇక నుంచి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జడ్పీ సీఈవో ప్రసూనరాణి, అన్ని శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
అపరిష్కృత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కలెక్టర్ ప్రియాంక ఆల, చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. గత సమావేశంలో సభ్యులు సభ దృష్టికి చాలా సమస్యలు తెచ్చారని, గతంలో ఉన్న అధికారులు ఎన్నికల నేపథ్యంలో బదిలీపై వెళ్లడంతో అవి పెండింగ్లో ఉన్నాయన్నారు. వారి స్థానంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు చాలా సమస్యలను మా దృష్టికి తెచ్చారని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. గతంలో మంజూరై నిలిచిపోయిన పనులను కూడా ప్రభుత్వ అనుమతితో పూర్తి చేస్తామన్నారు.