ఖమ్మం, మే 8 : అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి ఊసెత్తని కాంగ్రెస్ పాలకులకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ బుధవారం నగరంలోని బురహాన్పురంలో వద్దిరాజు విస్తృతంగా ప్రచారం చేశారు. వాడవాడలా.. గడపగడపకూ కలియతిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి నామాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది.. తాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఈసడించుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారని, కనీసం సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీల మాటే లేదన్నారు. ఇంటింటా ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. జిల్లా ప్రజలు చైతన్యవంతులని, ఇకడ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్లో మాలోతు కవిత ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, పొన్నం వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు శీలంశెట్టి రమాదేవి, బుర్రి వెంకట్ పాల్గొన్నారు.
బురహాన్పురంలో ప్రచారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఇస్త్రీ షాపును సందర్శించారు. కొద్దిసేపు బట్టలు ఇస్త్రీ చేసి కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతునివ్వాలని షాపు యజమాని వెంకన్నను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించాడు.