కూసుమంచి, జనవరి 31 : మూడు జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుంచి బుధవారం సాయంత్రం పాలేరు జలాశయానికి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పాలేరు నీటిమట్టం 11.30 అడుగులకు పడిపోగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు. అయితే జనవరిలోనే నీటి సమస్య ఉత్పన్నమైతే వేసవిలో తీవ్ర తాగునీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఇందుకు ప్రత్యామ్నాయంగా సాగర్ నుంచి ప్రస్తుతానికి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
పాలేరు జలాశయానికి నీటిమట్టం 22 అడుగులు వచ్చే వరకు సుమారు వారంరోజుల పాటు నీటిని వదిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్ డ్యాం కూడా నీటి విషయంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుండడంతో ప్రతీ నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని, అందుకు ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సాగర్ నుంచి పాలేరు వరకు ఉన్న మేజర్లు, మైనర్లు, తూములు, షట్టర్ల వంటి వాటితోపాటు ఎక్కడా కాలువలో నీరు ప్రవహించే సమయంలో ట్యాంపరింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు పాలేరుకు సాగర్ జలాలు చేరుకునే అవకాశం ఉంది.