టేకులపల్లి, ఫిబ్రవరి 15: గని ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని, కాలుష్య నివారణకు చర్యలు తీసు కోవాలని కోయగూడెం గని ప్రభావిత ప్రాంతవాసులు డిమాండ్ చేశారు. టేకులపల్లి మండల పరిధిలోని సింగరేణి ఇల్లెందు ఏరియా కోయగూడెం ఉపరితల గని (కేవోసీ) పిట్-2 విస్తరణపై గురువారం కేవోసీ ప్రాజెక్ట్ కార్యాలయ ఆవరణలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, సింగరేణి ఏరియా జీఎం జాన్ ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. గని జనావాసాలకు చాలా దగ్గరగా ఉందని, బొగ్గు వెలికితీత కారణంగా తాము కాలుష్యం బారిన పడుతున్నామని ప్రజలు సభ దృష్టికి తీసుకొచ్చారు. సింగరేణి యాజమాన్యం గని ప్రభావిత ప్రాంతాల్లో శుద్ధజల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి నెలా గ్రామాల్లో ఉచితంగా వైద్యశిబిరాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సామాజిక బాధ్యతలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేప ట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గని ప్రభావిత గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించేందుకు సహకరిస్తామన్నారు. కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి పరిధిలో బొగ్గు డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకే యాజమాన్యం పిట్ విస్తరణకు పూనుకుంటున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి రవీందర్, డీఎస్పీ రమణమూర్తి, సీఐలు టి.సురేశ్, రవీందర్, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో రవీందర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.