ఖమ్మం వ్యవసాయం, మార్చి 16: నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీగా కొన్నారు. వీరు కొద్ది రోజుల క్రితం వరకు ఖమ్మం మార్కెట్ నుంచి నేరుగా నౌకాశ్రయాలకు, అక్కడి నుంచి విదేశాలకు తేజా రకం మిర్చిని ఎగుమతి చేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం, మార్కెట్కు పంట రావడం తగ్గిపోవడంతో వ్యాపారులు పోటీ పడుతూ రేటు పెంచారు.
డిమాండ్ ఎక్కువ.. ఉత్పత్తి తక్కువగా ఉండడం.. రైతులపై కనక వర్షంలా కురుస్తున్నది. మార్కెట్ యార్డుకు గురువారం ఉదయం జెండా పాట సమాయానికి వివిధ జిల్లాల నుంచి 26,000 మిర్చి బస్తాలు వచ్చాయి. జెండా పాటలో క్వింటాల్ గరిష్ఠ ధర రూ.23,000, మధ్య ధర రూ.20,900, కనిష్ఠ ధర రూ.18,300 పలికింది. తాలు రకం మిర్చి క్వింటాల్ ధర రూ.14,000 పలికింది. రాబోయే కొద్ది రోజుల్లో క్వింటాల్ ధర రూ.25,000కు చేరుకోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇలా ‘ఎర్ర బంగారాని’కి యమ డిమాండ్ ఉండడంతో తమ ‘పంట పండింద’ని మిర్చి రైతులు సంబురపడుతన్నారు.