ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాకు రికార్డు స్థాయి ధర పలికింది. ఉదయం మార్కెట్ యార్డులోని ఈ-బిడ్డింగ్లో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో పంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీ పడ్డారు. ఫలితంగా గరిష్ట ధర క్వింటా రూ.8,550 పలికింది. దీంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మద్దతు ధరకు మించి దాదాపు క్వింటాకు రూ2,500 అధికంగా పలికినట్లయింది.
మార్కెట్ యార్డుకు ఈవాళ వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు 7,800 బస్తాల పత్తిని తీసుకొచ్చారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన వై కోటేశ్వరరావుకు చెందిన పంటను కొనుగోలు చేసేందుకు పోటీపడటంతో రికార్ఢు స్థాయి ధర పలికినట్లయింది.